ముంబై: నష్టాల ఊబిలో చిక్కుకున్న పంజాబ్-మహారాష్ట్ర సహకార బ్యాంక్ (పీఎంసీ) డిపాజిటర్ల డబ్బు పరిరక్షణ కోసం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కార్యాచరణ కొనసాగిస్తున్నది. ప్రత్యేకించి బ్యాంక్ డిపాజిటర్ల నగదుకు భద్రత కల్పించే ఇన్వెస్టర్ల కోసం అన్వేషణ సాగిస్తున్నది.
పీఎంసీ బ్యాంకు పరిరక్షణ కోసం తాము చేపట్టిన చర్యలు అమలులోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నదని ఆర్బీఐ తెలిపింది. ఈ నేపథ్యంలోనే జూన్ 30వ తేదీ నాటికి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్లో లావాదేవీల నియంత్రణపై ఆంక్షలు పొడిగించింది.
రియల్ ఎస్టేట్ డెవలపర్ హెచ్డీఐఎల్ సంస్థకు రుణాల మంజూరు వివరాల్లో తేడాలు ఉన్నాయని, ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగినట్లు ఆర్బీఐ తనిఖీలో తేలింది. దీంతో పీఎంసీ బోర్డును 2019 సెప్టెంబర్లో తప్పించిన ఆర్బీఐ.. ఆంక్షలు అమలులోకి తెచ్చింది. అలాగే ఖాతాదారుల విత్డ్రాయల్స్పైనా ఆంక్షలు అమలు చేసింది. నాటి నుంచి ఈ నిబంధనలు కొనసాగుతున్నాయి.
అటుపై బ్యాంకు పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ మొదలైంది. ఇందుకోసం ఇన్వెస్టర్ల నుంచి ఆఫర్లు వచ్చాయి. 2020 నవంబర్ మూడో తేదీన పీఎంసీ బ్యాంకు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (ఈవోఐ) జారీ చేసింది. తాజాగా డిపాజిటర్లు, ఇతర వాటాదారుల హక్కుల పరిరక్షణకు, వారికి భద్రత కల్పించే సామర్థ్యం గల ఇన్వెస్టర్ల కోసం పీఎంసీ, ఆర్బీఐ సంయుక్తంగా గాలిస్తున్నాయి.
పీఎంసీ బ్యాంకులో ఆర్థిక లావాదేవీలు, నగదు విత్ డ్రాయల్స్ మీద ఆంక్షలను తొలుత 2020 డిసెంబర్ వరకు.. అటుపై ఈ నెలాఖరు వరకు పొడిగించింది. పీఎంసీ పునర్వ్యవస్థీకరణ లక్ష్యాలను చేరుకునే వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని ఆర్బీఐ తెలిపింది.
హెచ్డీఐఎల్ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు రూ.6,500 కోట్లకు పైగా పీఎంసీ బ్యాంకు రుణాలిచ్చింది. మొత్తం బ్యాంకు ఇచ్చిన రుణాల్లో ఇది 73 శాతంగా ఉన్నది. ఆర్బీఐ తనిఖీల ప్రకారం 2019 సెప్టెంబర్ 19 నాటికి పీఎంసీ రుణాలు రూ.8,880 కోట్లుగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో బ్యాంకు లావాదేవీలపై ఆంక్షలు విధించిన ఆర్బీఐ.. తొలుత డిపాజిటర్లు రూ.1000 మాత్రమే విత్డ్రా చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. తర్వాత వారి కష్టాలను తీర్చుకునేందుకు రూ. లక్ష వరకు విత్డ్రాయల్కు అనుమతినిచ్చింది. గతేడాది మార్చి నెలాఖరు నాటికి పీఎంసీ బ్యాంకు డిపాజిట్లు రూ.10,727.12 కోట్లు కాగా, మొండి బాకీలు రూ. 3,518.89 కోట్లుగా ఉన్నాయి.
మా వాదనే నిజమైంది.. సుప్రీం తీర్పుపై రతన్ టాటా!
ధరలకనుగుణంగా ముడి చమురు దిగుమతి పాలసీ: ధర్మేంద్ర ప్రధాన్
స్క్రాపేజీ పాలసీ అమలు కష్టమే.. మారుతి ఈడీ శ్రీవాత్సవ
రిలయన్స్-ఆరామ్కో డీల్ మరింత జాప్యం.. ఎందుకంటే!