ఏర్గట్ల/ముప్కాల్, మే 8 : అసెంబ్లీ ఎన్నికల్లో దొంగ హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఆ పార్టీ నాయకులు ప్రస్తుతం ప్రచారం కోసం వచ్చినప్పుడు ఆరు గ్యారెంటీల అమలుపై నిలదీయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి జనంలోనే లేరని, రైతులను మోసం చేసి గెలిచిన అర్వింద్ ఐదేండ్లల్లో ఒక్క గ్రామంలోనైనా అభివృద్ధి పనులు చేపట్టిన దాఖలాలు లేవన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి పనుల కోసం ఇచ్చిన ప్రొసీడింగ్ కాపీలన్నీ బోగస్ అంటూ కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కలెక్టరేట్కు వెళ్లి అవి బోగస్ అని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఏర్గట్ల, ముప్కాల్ మండలకేంద్రాలతోపాటు మెండోరా మండలం దూదిగాం గ్రామంలో బీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్తో కలిసి బుధవారం రోడ్షో, ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ..
రేవంత్రెడ్డి ఝూటా సీఎం అని అన్నారు. వంద రోజుల్లో ఇస్తామన్న హామీలను 150రోజులైనా అమలు చేయకుండానే మరోసారి లోక్సభ ఎన్నికల సందర్భంగా అబద్ధాలు మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానన్న అర్వింద్ ఐదేండ్లు గడిచినా తీసుకురాలేదన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు ఓట్లతో సురుకులు పెట్టాలన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, కుల సంఘాలకు మంజూరు చేసిన నిధులను గుర్తుచేశారు. అప్పుడు మంజూరు చేసిన పనులను పూర్తి చేసేలా వీడీసీలు కాంగ్రెస్ నాయకులపై ఒత్తిడి తేవాలని కోరారు. జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం కొట్లాడి నిధులను తెచ్చేందుకు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటువేసి బాజిరెడ్డి గోవర్ధన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అప్పటి సీఎం కేసీఆర్ను ఒప్పించి ఏర్గట్లను మండలకేంద్రంగా మార్చడంతోపాటు కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టి రూపురేఖలను పూర్తిగా మార్చానని అన్నారు. ముప్కాల్, మెండోరా మండలాలను అభివృద్ధి చేసిన తీరును వేముల వివరించారు.