తిరుమల : నేటి నుంచి ఐదు రోజుల పాటు తిరుమలలో హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుగనున్నాయి. తిరుమల గిరుల్లోని అంజనాద్రిని హనుమంతుడిని జన్మస్థలంగా ప్రకటించిన తర్వాత తొలిసారిగా వేడుకలను నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. శుక్రవారం నుంచి ఈ నెల 8వ తేదీ వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా బాల హనుమ, అంజనాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, ఒక్కో రోజు ఒక్కో రకం పుష్పాలతో ఆంజనేయుడికి అభిషేకం, అర్చన నిర్వహించనున్నట్లు టీటీడీ పేర్కొంది. ఆకాశగంగ తీర్థంలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి.
ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు హనుమాన్ చాలీసా పారాయణం జరుగనుంది. ఉత్సవాల్లో తొలిరోజు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు డాక్టర్ రాణి సదాశివమూర్తి చే హనుమంతుడు, అష్టసిద్ధులు అనే అంశంపై నేటి పరిస్థితులకు అనుగుణమైన విధంగా సవివర వ్యాఖ్యానం ఉంటుందని టీటీడీ పేర్కొంది. తిరుమలకు వచ్చే యాత్రికులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వేడుకల్లో పాల్గొనడానికి అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపింది.