న్యూఢిల్లీ: తన కొత్త ప్రైవసీ పాలసీని బలవంతంగా అంగీకరింపజేసేందుకు యూజర్లకు వాట్సాప్ రోజూ నోటిఫికేషన్లు పంపుతున్నదని కేంద్రం ఆరోపించింది. ఈ విధంగా లెక్కలేనన్ని నోటిఫికేషన్లను పంపిస్తూ ఉండటం ద్వారా.. యూజర్లు (విసిగిపోయి) కొత్త ప్రైవసీ పాలసీకి ఆమోదం తెలుపుతారనే దురుద్దేశం ఆ సంస్థ ప్రయత్నాల్లో కనిపిస్తున్నదని పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో గురువారం అదనపు అఫిడవిట్ను దాఖలు చేసింది. ‘వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లు’ చట్టం కాకముందే కొత్త ప్రైవసీ పాలసీకి యూజర్ల ఆమోదం తీసుకోవాలని వాట్సాప్ భావిస్తున్నదని, దీంట్లోభాగంగానే, వారికి రోజూ నోటిఫికేషన్లను వరదలాగా పంపుతున్నదని తెలిపింది. దీనిపై వాట్సాప్ అధికారికంగా స్పందిస్తూ.. కొత్త ప్రైవసీ పాలసీని ఆమోదించని యూజర్లకు కూడా సేవల్లో వేటినీ నిలిపివేయటం లేదని పునరుద్ఘాటించింది. అయితే, కొత్త పాలసీని ఆమోదించాలని వారికి ఎప్పటికప్పుడు గుర్తుచేస్తూ ఉంటామని స్పష్టంచేసింది.