కంఠేశ్వర్, ఏప్రిల్ 26: నిజామాబాద్ లోక్సభ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు ఎలీస్ వజ్ ఆర్ సమక్షంలో రెండో విడుత ర్యాండమైజేషన్ ప్రక్రియను శుక్రవారం పూర్తి చేశారు. రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్ఐసీ హాలులో ఎన్నికల సంఘం నిబంధనలను అనసరిస్తూ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులను, ఓపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. వీరికి ఇప్పటికే ఎంపిక చేసిన వివిధ కేంద్రాల్లో మాస్టర్ ట్రైనర్లతో పోలింగ్ నిర్వహణపై మొదటి విడుత శిక్షణ పూర్తి చేశారు. మే 1, 2వ తేదీల్లో రెండో విడుత శిక్షణకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. రిజర్వ్ సిబ్బంది సైతం అందుబాటులో ఉంటారని, పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన ప్రతి బృందంలోఒక ప్రిసైడింగ్ అధికారి,ఒక సహాయ ప్రిసైడింగ్ అధికారి,ఇతర పోలింగ్ సిబ్బంది ఉంటారని వివరించారు. ఈ సందర్భంగా మైక్రో అబ్జర్వర్ల ర్యాండమైజేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేశారు. అదనపు కలెక్టర్ అంకిత్, నగర పాలక సంస్థ కమిషనర్ మకరంద్, ఎన్ ఐ సీ అధికారి రవికుమార్, ఆర్డీవో రాజాగౌడ్, కలెక్టర్ ఏవో ప్రశాంత్, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.
కామారెడ్డి, ఏప్రిల్ 26 : కామారెడ్డి జిల్లాలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ఆధ్వర్యంలో రెండో విడుత ర్యాండమైజేషన్ చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 913 పోలింగ్ కేంద్రాలకుగాను 20 శాతం అదనపు సిబ్బందితో ర్యాండమైజేషన్ పూర్తి చేశామని కలెక్టర్ తెలిపారు. ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, పోలింగ్ సిబ్బందితో కలిపి1093 బృందాలను కేటాయించినట్లు చెప్పా రు. 4,388 మంది పోలింగ్ సిబ్బందికి మొదటి విడుత శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు.