మోర్తాడ్/వేల్పూర్/ఆర్మూర్ టౌన్/ వినాయక్నగర్/ ఖలీల్వాడి, మే 6 : జిల్లా కేంద్రంలో రోడ్ షో నేపథ్యంలో గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ బస్సు యాత్రకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జగిత్యాల జిల్లా నుంచి జిల్లాలోని కమ్మర్పల్లికి సాయంత్రం 6.30 గంటలకు చేరుకున్నారు. కేసీఆర్ కాన్వాయ్కి మహిళలు మంగళహారతులు పట్టారు. పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. అనంతరం బస్సులో వేల్పూర్ మండలం, ఆర్మూర్ మీదుగా జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. కంఠేశ్వర్ బైపాస్ రోడ్డు వద్ద నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పటాకులు కాలుస్తూ, బస్సుపై పూల వర్షం కురిపించారు. విద్యుత్ నగర్, కంఠేశ్వర్, కంఠేశ్వర్ క్రిస్టియన్ కాలనీ చౌరస్తా, అయ్యప్ప ఆలయం, విజయ్ థియేటర్ చౌరస్తా, ధర్నా చౌక్ మీదుగా కోర్టు చౌరస్తా వద్దకు రోడ్షో చేరుకున్నది. అప్పటికే జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చి.. కేసీఆర్ రాక కోసం ఎదురుచూస్తున్న ప్రజలు ‘జై కేసీఆర్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బస్సులో నుంచి కేసీఆర్ అభివాదం చేస్తూ చిరునవ్వుతో ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. బస్సు వెంబడి యువకులతోపాటు పిల్లలు, వృద్ధులు సైతం గులాబీ జెండాలను చేతపట్టుకొని పరుగుపెడుతూ కేసీఆర్పై అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. కేసీఆర్ కాన్వాయ్ వెళ్తున్నంత సేపు జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలు హోరెత్తాయి.
జనసముద్రం : జిల్లాకేంద్రంలోని గాంధీచౌక్ జనసముద్రాన్ని తలపించింది. ఎక్కడిప్రజలు అక్కడే నిలబడి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు.
దద్దరిల్లిన నెహ్రూపార్క్ రోడ్షోలో కేసీఆర్ స్పీచ్ను ప్రారంభించగానే ప్రజల అరుపులు, కేకలతో నెహ్రూపార్క్, గాంధీచౌక్ దద్దరిల్లింది. నగరమంతా జెండాలతో గులాబీమయమైంది.
అలరించిన కళాకారుల ఆటపాట రోడ్షో సందర్భంగా కళాకారుల ఆటపాట కార్యకర్తల్లో ఉత్సాహం నిపింది. మళ్లీ కారు రావాలే.. సారు కావాలే అంటూ కార్యకర్తలు నృత్యాలు చేశారు.
కేసీఆర్ నెహ్రూపార్క్ వద్దకు రాత్రి 8.30 గంటలకు చేరుకున్నారు. 8.35 గంటలకు ప్రజలకు అభివాదం చేశారు. 8.40 నుంచి 9 గంటల వరకు ప్రసంగించారు. 9.6 గంటలకు ఇండ్లకు క్షేమంగా వెళ్లాలని సూచించిన కేసీఆర్.. ప్రజలకు అభివాదం చేశారు.