ఉద్యమ సారథికి ఇందూరు బ్రహ్మరథం పట్టింది. గులాబీ జెండా ఎత్తిన నాడు అండగా నిలబడిన నిజామాబాద్ గడ్డ.. మరోసారి గులాబీ దళపతికి ‘జన’ స్వాగతం పలికింది. అదే ఆదరణ.. అదే అభిమానం.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై అడుగడుగునా పూల వర్షం కురిసింది. గులాబీ వనంగా మారిన జిల్లా కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోకు అపూర్వ స్పందన లభించింది. దాదాపు అరగంట పాటు ప్రసంగించిన బీఆర్ఎస్ అధినేత బీజేపీ, కాంగ్రెస్ తీరును ఎండగట్టారు. మాటలతో మోసపుచ్చిన రెండు పార్టీలను ఓడించి, నిజామాబాద్ పులిబిడ్డ బాజిరెడ్డి గోవర్ధన్ను గెలిపించాలని పిలుపునిచ్చారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండ్రోజులుగా చేపట్టిన బస్సు యాత్ర, రోడ్షో దిగ్విజయమైంది. సోమవారం రాత్రి నిజామాబాద్లో ఉవ్వెత్తున తరలి వచ్చిన జనంతో రోడ్షో సూపర్ సక్సెస్ అయ్యింది. జగిత్యాల నుంచి బస్సులో వచ్చిన కేసీఆర్కు దారిపొడవునా జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో ఘన స్వాగతం లభించింది. నిజామాబాద్ సరిహద్దు ప్రాంతమైన కమ్మర్పల్లి వద్ద మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నేతృత్వంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం మోర్తాడ్, వేల్పూర్ ఎక్స్ రోడ్డు మీదుగా వచ్చిన గులాబీ బాస్కు ఆర్మూర్ నేతలు, ప్రజలంతా కలిసి ఎదురేగి జయహో కేసీఆర్ అంటూ నిజామాబాద్ వైపు కదిలారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సారథ్యంలో భారీ కాన్వాయ్ పెర్కిట్ మీదుగా జిల్లా కేంద్రం వైపునకు కదలగా గూపన్పల్లి వద్ద బిగాల గణేశ్ గుప్తా నేతృత్వంలో మాజీ సీఎం కేసీఆర్కు భారీ ఎత్తున స్వాగతం లభించింది. బైపాస్ రోడ్డు నుంచి జనవాహిని మధ్య బస్సు యాత్ర కొనసాగింది.
నిజామాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను వెంట పెట్టుకొని దారిపొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. నెహ్రూ పార్కుకు చేరుకున్న అనంతరం అక్కడ నిర్వహించిన రోడ్షోలో అశేష జనవాహినిని ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తీరును ఎండగట్టడంతోపాటు పార్లమెంట్ పోరులో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఆవశ్యకతను కేసీఆర్ నొక్కి చెప్పారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గిరిజనులకు బ్రహ్మాండంగా నాలుగున్నర లక్షల ఎకరాలకు పోడు భూములు ఇచ్చామని కేసీఆర్ చెప్పారు. వాళ్లకు రైతుబంధు ఇవ్వడంతోపాటు రైతుబీమా కూడా ఇచ్చామన్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా గిరిజనులకు ఇవ్వలేదన్నారు. ఇలా ఈ ఒక్కవర్గం ప్రజలనే కాదు… ఇటు దళితులను, ముస్లిం మైనార్టీ సోదరులతోపాటు అందరినీ ఇబ్బందులు పెడుతున్నదన్నారు. తాను ఉన్నప్పుడు ముస్లిం మైనార్టీ సోదరులకు ప్రతి సంవత్సరం రంజాన్ తోఫా పంపించానని, మరి ఈసారి తోఫా వచ్చిందా.. ఇఫ్తార్ విందులు జరిగినయా.. అని కేసీఆర్ అడగ్గా.. రాలేదంటూ సభకు వచ్చిన ముస్లిం ప్రజలంతా ముక్తకంఠంతో చెప్పారు. ‘ఎలా వస్తాయి.. రావు.. వాళ్లు ఎవర్వినీ గౌరవించరు.. ముస్లిం, మైనార్టీలు, హిందువులను ఎవ్వరినీ పట్టించుకోరు. లంబాడా, గిరిజనులకు ఇవ్వాల్సింది ఇవ్వరు..’ నాలుగు నెలల్లో ఇంత రాక్షస పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతుందంటూ ధ్వజమెత్తారు. బంపర్ మెజార్టీతో బాజిరెడ్డి గోవర్ధన్ గెలుస్తున్నారని కేసీఆర్ ధీమా వ్యక్తంచేశారు. స్వల్ప వ్యవధిలోనే ఏ రకంగా చూసినా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా వైఫల్యం చెందిందని, బీజేపీతో మనకేమీ ఒరగలేదన్నారు. మంచినీళ్లు రాక.. సాగునీళ్లు రాక.. కష్టపడి పండిన పంటను కొనేటోళ్లు లేక రైతు గోసపడుతున్నారని, ఐదు నెలల్లో రాష్ట్రంలో రాక్షస పాలన చూసినమని, ఇవన్నీ మారాలంటే.. పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు ఉండాల్సిన అవశ్యకత ఉందంటూ గులాబీ దళపతి కేసీఆర్ అన్నారు.
‘నేను గులాబీ జెండా ఎత్తిన్నాడు నిజామాబాద్ జిల్లా అండగా నిలబడ్డది. నేను బతికినంత కాలం నిజామాబాద్ నా గుండెల్లో ఉంటది. ఉద్యమాన్ని ఆకాశానికి ఎత్తింది కూడా ఈ గడ్డనే. నేను మీ బిడ్డగా చెప్తున్నా. బీజేపీ ఎంపీలు గెలిస్తే మోదీ దగ్గర చేతులు కట్టుకుంటారు. మన హక్కుల కోసం నోరు మెదపరు’
‘అన్ని విషయాల్లో మోదీని వ్యతిరేకించిన కాబట్టే, బీజేపీ చెప్పినట్లు నేను వినలేదనే నా బిడ్డ కవితను అరెస్ట్ చేసి జైల్లో వేసిండ్రు. అయినా నేను భయపడను. కేసీఆర్ ఏనాడూ లొంగిపోలేదు. లొంగిపోయే వ్యక్తి కాదు. మరింత ఉధృతంగా పోరాటం చేస్తా.’
‘నేను హిందువును.. తెలంగాణ ప్రజలకు ఆత్మబంధువును. అందరం కలిసి బతకాలి. దాంట్లోనే గొప్పతనం. దాంట్లోనే బలం ఉంటది. కానీ ప్రజలను విడదీసేలా మత విద్వేషాలు రెచ్చగొడితే లాభం ఉండదు. మీ ఎంపీ (అర్వింద్) నోరు తెరిస్తే ఎట్లాంటి మాటలు ఉంటాయో. ఎంత గందరగోళం ఉంటదో తెలుసు’