హైదరాబాద్ : మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు కారుతో ఢీ కొన్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మెడికో( Medico) విద్యార్థి ప్రియాంక ( Priyanka ) ఆదివారం సాయంత్రం మృతి చెందింది. గత వారం రోజులుగా సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆమె పరిస్థితి మరింత విషమించి మృతి చెందింది.
ఏపీలోని రాజమహేంద్రవరంలో ఈనెల 3న రాత్రి సినిమామాల్ నుంచి తన స్నేహితుడితో బయటకు వచ్చిన ప్రియాంక వాహనాన్ని మద్యం మత్తులో ఉన్న దస్వంత్, ఆండ్రూ జోసఫ్ కారుతో ఢీ కొట్టారు. దీంతో ప్రియాంక తలకు తీవ్ర గాయాలతో ఆమెను స్థానిక ఆసుపత్రిలో అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించారు. అప్పటి నుంచి ఆమెకు వైద్యులు వెంటిలేటర్పై చికిత్స అందజేశారు.
ఆమెను బతికించేందుకు వైద్యులు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆమె తుదిశ్వాస విడిచింది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా వారికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.