mujeeb hussaini | అతను క్రికెట్ను కెరీర్గా ఎంచుకుని ఉంటే, జాతీయ జట్టులో ఆడేవాడేమో. కానీ, తండ్రికి ఇచ్చిన మాట సర్కారు కొలువు వైపు నడిపించింది. సహజ నాయకత్వ లక్షణాలు ఉద్యోగ సంఘానికి నేతను చేశాయి. ఆంధ్రోళ్ల పాలనలోని వివక్ష, అవమానాలు ఉద్యమకారుడిగా తీర్చిదిద్దాయి. గుండెల్లోని సహానుభూతి సామాజిక సేవకుడిని చేసింది. అన్నదాన శిబిరాలు, రక్తదానాలు, అనాథలకు అండదండలు… తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల (టీఎన్జీవో) సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎస్.ఎం. ముజీబ్హుస్సేనీ జీవితంలోని ప్రతి మలుపూ, ప్రతి గెలుపూ ఓ స్ఫూర్తిపాఠమే. ఆ అనుభవాలు, జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే..
మాది రాజేంద్రనగర్. నాన్న వ్యవసాయ శాఖలో ఉద్యోగి. నాకు ఐదుగురు అన్నలు, ఇద్దరు అక్కలు. నేనే చిన్నవాణ్ని. తోబుట్టువులు నన్ను ప్రేమగా చూసుకునేవారు. ఏం అడిగినా కాదనకుండా ఇచ్చేవారు. ఆ ఆత్మీయతే సామాన్యుల తరఫున నిలబడగల బలాన్ని ఇచ్చింది. మా ఊళ్లో కులమత ఘర్షణలకు తావు లేదు. ఎవరింట్లో వేడుక జరిగినా అందరికీ పండుగే. పచ్చదనమంటే నాకు ప్రాణం. నా జీవిత భాగస్వామి పేరు యాస్మిన్ ఫర్దానా. మాకు ముగ్గురు పిల్లలు.. సయ్యద్ అసదుద్దీన్, నీమ, దీన. నాకు క్రికెట్ అంటే ప్రాణం. కానీ, ‘క్రికెటర్గా కంటే సామాజిక సేవకుడిగానే నిన్ను చూడాలని ఉంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించు. సామాన్యులకు అండగా నిలబడు’ అంటూ నాన్న చేసిన దిశా నిర్దేశమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. నేను 1991లో గిల్ట్లో టెక్నీషియన్గా కొలువు సాధించాను. ల్యాబ్ అసిస్టెంట్గా చేశాను. 30 ఏండ్ల ఉద్యోగ జీవితంలో ఎన్నో మలుపులు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్లో ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్నాను. టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నాలుగుసార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను.
ఒక ఉద్యోగిగా ఉమ్మడి పాలనలో అనేక అవమానాలు భరించాను. గొంతెత్తి ప్రశ్నించే వాతావరణమే ఉండేది కాదు. సర్దుకుపోయి బతకాల్సిన పరిస్థితి. భయంభయంగా బతుకీడ్చేవాళ్లం. తెలంగాణ పోరాటాన్ని కేసీఆర్ ఉధృతం చేయడంతో మాలో కొత్త ఆశలు చిగురించాయి. మన రాష్ట్రం మనం తెచ్చుకుంటే మంచి రోజులు వస్తాయన్న ఆశ, బతుకులు మారుతాయన్న భరోసా. పరోక్షంగా కేసీఆర్ ఇచ్చిన ప్రతి పిలుపునకూ స్పందించేవాళ్లం, ప్రతి కార్యక్రమ విజయానికి సహకరించేవాళ్లం. తెలంగాణ భవన్ నిర్మాణ సమయంలో ఓ రోజు దేవీ ప్రసాద్గారు నన్ను అక్కడికి తీసుకెళ్లారు. అప్పుడే మొదటిసారి కేసీఆర్ను కలిశాను. చాలా సంతోషంగా అనిపించింది. ఆ భేటీ నాకు కొత్త శక్తిని ఇచ్చింది. ‘ముజీబ్! నీ గురించి విన్నాను. బాగా పనిచేయండి. మంచి భవిష్యత్తు ఉంటుంది’ అని ప్రోత్సహించారు.
ప్రజా జీవితంతో మమేకం కావాలంటే, కుటుంబ ప్రోత్సాహం ఉండాలి. లేకపోతే, అడుగులు ముందుకుపడవు. అన్నివిధాలా అండగా నిలబడి, నేను ఉన్నానంటూ భుజం తట్టింది నా భార్య యాస్మిన్ ఫర్దానా. ఉదయం బయటికి వెళ్తే, రాత్రి ఎప్పటికో కానీ ఇల్లు చేరుకోలేని పరిస్థితి. ప్రస్తుతం రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల సంఘం చైర్మన్గా, మూడు విశ్వవిద్యాలయాల ఉద్యోగులకు సలహాదారుగా, గచ్చిబౌలి హౌజింగ్ సొసైటీ కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. నిత్యం ఏదో ఒక కార్యక్రమం ఉంటుంది. సాయం కోసం, సలహాల కోసం ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తుంటారు. అర్ధరాత్రి తలుపు తట్టినా స్పందిస్తాను. ఈ బాధ్యతల నడుమ పిల్లలతో గడిపే సందర్భాలు చాలా తక్కువ. వాళ్లూ నన్ను అర్థం చేసుకున్నారు.
నా జీవితంలో సామాజిక సేవ ఓ భాగం. ప్రతి నెలా కచ్చితంగా ఓ నాలుగు రోజులు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వద్ద అన్నదానం చేస్తాను. ఏటా నా పుట్టినరోజు నాడు ఆ దవాఖాన ప్రాంగణంలోని అమ్మవారి ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహిస్తాను. ఆ తర్వాత నాంపల్లిలో క్రిస్టియన్ అనాథాశ్రమంలో కొంతసేపు గడుపుతాను. అభాగ్యులకు నావంతు సాయం అందిస్తాను. అటునుంచి దర్గాకు వెళ్తాను. మొదటినుంచీ పుట్టినరోజును సర్వమత ప్రార్థనలతో జరుపుకోవడం నాకు అలవాటు. షిర్డీ, తిరుమల, శబరిమల, అజ్మీర్ షరీఫ్ దర్గాలకు ఏటా ఇద్దరు చొప్పున.. ప్రతీ ఏడాది టీఎన్జీఓ హైదరాబాద్ జిల్లా పక్షాన సొంత ఖర్చులతో పంపిస్తుంటాం. నా తల్లిదండ్రులు అన్వరున్నీసా బేగం-సయ్యద్ అసదుల్లా హుస్సేని పేరిట అసద్-అన్వర్ ట్రస్ట్ నేతృత్వంలో వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. కొవిడ్ ఉధృతంగా ఉన్న రోజుల్లో నా వంతుగా పదివేల పైచిలుకు కుటుంబాలకు చేయూత ఇచ్చాను. జిల్లా శాఖ ఉద్యోగులతో నారాయణగూడ ఐపీఎం, ఫీవర్ దవాఖానలో రెండు రోజులపాటు రక్తదాన శిబిరం నిర్వహించాం. 388 యూనిట్ల రక్తాన్ని సేకరించినందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ నన్ను సత్కరించారు. నేను చేపడుతున్న కార్యక్రమాలకు గుర్తింపుగా పుణెలోని విశ్వకర్మ విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఉత్తమ ఉద్యోగి అవార్డు కూడా అందుకున్నాను. ముఖ్యమంత్రి ఆహ్వానిస్తే ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించేందుకూ సిద్ధంగా ఉన్నాను.
ఓ రోజు మంత్రి కేటీఆర్ నన్ను పిలిచి ‘ముజీబ్ బాగా పనిచేస్తున్నావు. ఏం కావాలో చెప్పు?’ అని అడిగారు. అప్పటికే 28 సమస్యలతో కూడిన ఓ లేఖ నా జేబులో సిద్ధంగా ఉంది. వెంటనే ఆయన ముందుంచాను. ‘నా సొంత ప్రయోజనాలు ఏమీ లేవు సర్. ఉద్యోగుల సమస్యల పరిష్కారమే నాకు ముఖ్యం’ అని చెప్పాను. వెంటనే కేటీఆర్ స్పందిస్తూ.. ‘వెరీ గుడ్! ఇలానే కష్టపడు. మంచి భవిష్యత్తు ఉంటుంది’ అంటూ భుజం తట్టారు. అప్పటికప్పుడు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషిచేశారు. కేటీఆర్ లాంటి నిబద్ధతగల నాయకుడు ఉండటం మన అదృష్టం.
✍ గొరిగె రమేశ్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Vijayalakshmi | చదివింది పదో తరగతే కానీ.. చేసేది కోట్ల బిజినెస్
Gray hair | చిన్నవయసులోనే తల నెరిసిన వారికి ఈమె ఓ ఇన్స్పిరేషన్.. ఎందుకంటే?
shaik saleema | తెలంగాణలో తొలి ముస్లిం ఐపీఎస్గా షేక్ సలీమా రికార్డ్.. ఆమె బ్యాక్గ్రౌండ్ ఇదీ..
Saami Saami | పుష్పలో సామీ సామీ పాట పాడిన మౌనికకు ఇన్స్పిరేషన్ ఈమెనే
విదేశాలకూ తెలంగాణ రుచులను అందిస్తున్న కరీంనగర్ మహిళలు
మూడేండ్ల క్రితం దాకా టీ పెట్టడం కూడా రాదు.. కానీ ఇప్పుడు మాస్టర్ చెఫ్
sheela bajaj | 78 ఏండ్ల వయసులో వ్యాపారం మొదలుపెట్టిన బామ్మ