హైదరాబాద్, ఏప్రిల్ 25 ( నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా గురువారం అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా భద్రాచలంలో 44 డిగ్రీలు, ఖమ్మంలో 43.4, నల్లగొండలో 42.8, నిజామాబాద్లో 42.7, రామగుండంలో 42.4 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
నిన్నమొన్నటి వరకు వర్షాలు కురిసి కాస్త చల్లబడ్డా.. ఇప్పట్లో వర్షాలు లేనట్టేనని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం నుంచి ఎండలు మరింత పెరుగుతాయని హెచ్చరించారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీల వరకు పెరిగే సూచన ఉన్నట్టు తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 4 గంటల మధ్య అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని వైద్య నిపుణులు సూచించారు.