ఆత్మ విస్వాసంతో ముందుకుసాగాలి
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సీ పార్థసారథి
ఆదిలాబాద్ జడ్పీ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం
ఎదులాపురం, జూన్ 28 : నిరాశ, నిస్పృహలను ధరిచేరనివ్వకుండా, ఏకాగ్రతతో చదివితే లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సీ పార్థసారథి యువతకు సూచించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువతీయువకులకు దిశానిర్దేశం చేశారు. ఉద్యోగ సాధనలో భాగంగా పాటించాల్సిన మెళకువలను అర్థవంతంగా, ఆకట్టుకునేలా వివరిస్తూ వారిలో ఆత్మైస్థెర్యం నింపారు. తన స్వీయ అనుభవాలను జోడించి పలు అంశాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరిలో నైపుణ్యం, శక్తి సామర్థ్యం ఉంటాయని, వ్యక్తిగత నమ్మకం ఉంచి కష్టపడితే విషయం సాధిస్తారని పేర్కొన్నారు. వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నుంచి వస్తున్న నోటిఫికేషన్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. త్వరలో రాష్ట్రంలో ఉద్యోగ విప్లవం రానున్నదని, ఇప్పటికే గ్రూప్-1, ఎస్ఐ, కానిస్టేబుల్ నోటిఫికేషన్లు వచ్చాయన్నారు. త్వరలోనే గ్రూప్-2, 4, ఇతర ఉద్యోగ ప్రకటనలు కూడా రానున్నాయని వివరించారు. అంతకుముందు కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశం అన్నారు. వివిధ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీయువకులకు ఎస్సీ, బీసీ, మైనార్టీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వడంతో పాటు స్టడీ మెటీరియల్ కూడా అందజేస్తామని తెలిపారు.
సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎస్ఐ, కానిస్టేబుల్ పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. నోటిఫికేషన్లు వెలువడినప్పుడు చూపిన ఉత్సాహాన్ని పరీక్ష పూర్తి చేసే వరకు కొనసాగించాలని తెలిపారు. ఆ తర్వాత అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ.. నిరుద్యోగ అభ్యర్థులు ప్రణాళిక రూపొందించుకొని, అందుకు అనుగుణంగా సాధన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్, ఆర్డీవో రమేశ్ రాథోడ్, జడ్పీ సీఈవో గణపతి, డీపీవో శ్రీనివాస్, దళిత అభివృద్ధి అధికారి సునీత, బీసీ అభివృద్ధి అధికారి రాజలింగు, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి, యువజన క్రీడల అధికారి వెంకటేశ్వర్లు, సమాచార పౌర సంబంధాల అధికారి ఎన్ భీం కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల కమిషనర్కు ఘన స్వాగతం..
నిర్మల్ టౌన్, జూన్ 28 : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్మల్లో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఎస్పీ ప్రవీణ్కుమార్ ఘన స్వాగతం పలికారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్తున్న ఆయనకు, నిర్మల్ అటవీశాఖ అతిథి గృహంలో పుష్పగుచ్ఛం అందించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, రాంబాబు, ఆర్డీవో తుకారాం, తహసీల్దార్ సుభాష్చందర్, డీపీఆర్వో తిరుమల తదితరులు పాల్గొన్నారు.