Raymond – Nawaz Modi Singhania | ప్రముఖ దుస్తుల తయారీ సంస్థ రేమండ్ గ్రూప్ కంపెనీలు జేకే ఇన్వెస్టర్స్, రేమండ్ కన్జూమర్ కేర్, స్మార్ట్ అడ్వైజరీ అండ్ ఫిన్ సర్వ్ నుంచి నవాజ్ మోదీ సింఘానియాను డైరెక్టర్గా తొలగిస్తున్నట్లు కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు. గత నెల 31న జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రేమండ్ గ్రూప్ చైర్మన్ గౌతం సింఘానియా, ఆయన భార్య నవాజ్ మోదీ సింఘానియా మధ్య కోర్టులో విడాకుల కేసు నడుస్తున్న నేపథ్యంలో గ్రూపు సంస్థల డైరెక్టర్గా ఆమె తొలగింపునకు ప్రాధాన్యం ఏర్పడింది. నవాజ్ మోదీ పై తాము విశ్వాసం కోల్పోయామని, వెంటనే బోర్డు సమావేశం నిర్వహించాలని కోరామని ఆయా కంపెనీల ప్రతినిధులు తెలిపారు. వారి కోరిక మేరకు గత నెల 31న జరిగిన బోర్డు సమావేశంలో డైరెక్టర్గా నవాజ్ మోదీ సింఘానియాను తొలగించినట్లు చెప్పారు.
రేమండ్ గ్రూపు కంపెనీల్లో డైరెక్టర్గా తనను తొలగించడాన్ని నవాజ్ మోదీ తీవ్రంగా తప్పుబట్టారు. గౌతం సింఘానియా దుశ్చర్యలను బయటపెట్టినందుకే తనపై కక్ష సాధిస్తున్నారని, దీన్ని చట్టపరంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. కొంత కాలంగా గౌతం సింఘానియా, నవాజ్ మోదీ మధ్య వివాదం నెలకొన్నది. తనను గౌతం తీవ్రంగా వేధిస్తున్నారంటూ గతేడాది నవాజ్ మోదీ ఆరోపించారు. భౌతికంగానూ తనను హింసించారన్నారు. ప్రస్తుతం వీరిద్దరు విడాకుల కోసం పెట్టుకున్న దరఖాస్తు న్యాయస్థానం పరిధిలో ఉంది. ఆస్తుల్లో వాటాల విషయమై వివాదం కొనసాగుతున్నది. ఇదిలా ఉంటే, కోడలు నవాజ్ మోదీ సింఘానియాకే ఆమె మామ-విజయ్ పత్ సింఘానియా మద్దతు పలికారు. తండ్రీ కొడుకులు విజయ్ పత్ సింఘానియా, గౌతం సింఘానియా మధ్య కూడా వివాదాలు ఉన్నాయి.