ముంబై: మహారాష్ట్రలోని పూణే జిల్లాలో బారామతి ఎయిర్పోర్ట్ సమీపంలో ఆదివారం ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన శిక్షణా విమానం కూలిపోయింది. అయితే ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. (Trainer Aircraft Crashes) ఏడు నెలల క్రితం బారామతి ఎయిర్స్ట్రిప్లో విమానం ల్యాండింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో అప్పటి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధ్యక్షుడు అజిత్ పవార్తో సహా ఐదుగురు మరణించిన తర్వాత తాజాగా ఈ ప్రమాదం జరుగడం విశేషం.
కాగా, ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ప్రైవేట్ కంపెనీకి చెందిన శిక్షణా విమానం కూలిందని పోలీస్ అధికారి తెలిపారు. విమానం ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పిందని చెప్పారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందా లేదా మరేవైనా ఇతర సమస్యలు ఉన్నాయా అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. కార్వర్ ఏవియేషన్ కంపెనీకి చెందిన సెస్నా 172 విమానంలో ఇద్దరు ప్రయాణికులు ఉన్నారని, ఈ ప్రమాదంలో వారు స్వల్పంగా గాయపడినట్లు తెలిపారు. విమానానికి స్వల్ప నష్టం జరిగిందని వివరించారు.
మరోవైపు మే 13న బారామతిలో ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన మరో శిక్షణ విమానం కూడా కూలింది. ఈ ప్రమాదంలో కూడా ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదు. బారామతి ఎయిర్పోర్ట్ ప్రాంతానికి ఆనుకుని ఉన్న గోజుబావి గ్రామం సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఆ విమానంలో ఒంటరిగా ఉన్న శిక్షణ పొందుతున్న పైలట్ సురక్షితంగా బయటపడ్డారు.