న్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు శుక్రవారం విచారణకు స్వీకరించింది. జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, దినేశ్ మహేశ్వరి ధర్మాసనం విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది. పిటిషన్ కాపీని ప్రతివాదులకు అందజేయాలని పిటిషనర్ను ఆదేశించింది. పరీక్షలను రద్దు చేసేలా సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ బోర్డులకు ఆదేశాలు జారీ చేయాలంటూ న్యాయవాది మమతాశర్మ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పరీక్షలను రద్దు చేసి, నిర్ణీత కాలపరిమితితో ఫలితాలను ప్రకటించడానికి ఆబ్జెక్టివ్ పద్ధతిని రూపొందించేలా కేంద్రం, సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ బోర్డులకు ఆదేశాలివ్వాలని పిటిషనర్ కోర్టును కోరారు.
దేశంలో కరోనా భారీగా కేసులు ఉన్నాయని, ఈ సమయంలో పరీక్ష నిర్వహించడం సాధ్యం కాదని, ఇంకా ఆలస్యం చేస్తే విద్యార్థుల భవిష్యత్కు కోలుకోలేని నష్టం వాటిల్లుతుందని పిటిషన్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. దేశంలో కరోనా మహమ్మారి పరిస్థితుల్లో ఏప్రిల్ 14న పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన బోర్డు.. 12వ తరగతి పరీక్షలను మాత్రం వాయిదా వేసింది. పరీక్షలు రద్దు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నా పరీక్షల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సీబీఎస్ఈ ఇటీవల తెలిపింది. ఇటీవల కేంద్ర విద్యాశాఖ 12వ తరగతి పరీక్షలపై రాష్ట్రాలతో సమావేశం నిర్వహించింది. ఇందులో జూలై 15 నుంచి ఆగస్టు 28 మధ్య నిర్వహించాలని నిర్ణయానికి వచ్చారు.
అయితే కరోనా నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై కేంద్రం రెండు ప్రతిపాదనలను ముందుంచింది. ఇందులో ఒకటి ముఖ్యమైన సబ్జెక్టులకు మాత్రమే పరీక్షలు నిర్వహించడం, రెండోది అన్నింటికీ పరీక్ష నిర్వహిస్తూ సమయాన్ని 3 గంటల నుంచి 90 నిమిషాలకు కుదించాలని ప్రతిపాదించింది. ఈ రెండు ప్రతిపాదనల్లో చాలా రాష్ట్రాలు రెండో ప్రతిపాదనకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పు మేరకు సీబీఎస్ఈతో పాటు రాష్ట్రాల బోర్డులు 12వ తరగతి పరీక్షలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.