న్యూఢిల్లీ : దేశంలో కరోనా తగ్గుముఖం పడుతున్నది. ఇటీవల రెండు లక్షలకుపైగా నమోదైన కేసులు.. తాజాగా రెండు లక్షలకు దిగువన చేరాయి. 44 రోజుల తర్వాత కనిష్ఠ స్థాయికి రోజువారీ కేసులు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,86,364 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 2,59,459 మంది బాధితులు కోలుకున్నారు. మరో 3,660 మంది వైరస్ బారినపడి ప్రాణాలు వదిలారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,75,55,457కి చేరగా.. ఇప్పటి వరకు 2,48,93,410 మంది కోలుకున్నారు. మొత్తం 3,18,895 మంది వైరస్ బారినపడి మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలో 23,43,152 యాక్టివ్ కేసులున్నాయని కేంద్రం పేర్కొంది.
దేశంలో రికవరీ రేటు 90.34శాతానికి పెరిగిందని చెప్పింది. ప్రస్తుతం దేశంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 10.42శాతంగా ఉందని, రోజు వారీ పాజిటివిటీ రేటు 9శాతానికి చేరుకుందని పేర్కొంది. వరుసగా నాలుగు రోజుల్లో పాజిటివిటీ రేటు పది శాతానికన్నా తక్కువగా ఉందని పేర్కొంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 20.57 కోట్ల వ్యాక్సిన్ మోతాదులను అందజేసినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. ఇదిలా ఉండగా నిన్న ఒకే రోజు 20.70లక్షల కొవిడ్ శాంపిల్స్ పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 33.90 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు వివరించింది.