న్యూఢిల్లీ, మే 27: వృద్ధులకు, దివ్యాంగులకు వారి ఇంటికి దగ్గర్లోనే కరోనా వ్యాక్సిన్ సులభంగా లభించేలా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు ఎన్హెచ్సీవీసీ కార్యక్రమంలో ప్రత్యేకంగా టీకా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. 60 ఏండ్లు దాటిన వారు, దివ్యాంగులు, ఆరోగ్య సమస్యల వల్ల నడువలేని వారు ఈ కేంద్రాల్లో టీకాలు వేయించుకోవడానికి అర్హులు. ఈ కే్రందాలను దవాఖానల్లో కాకుండా.. కమ్యూనిటీ సెంటర్లు, ఆర్డబ్ల్యూఏ కేంద్రం/ఆఫీసు, పంచాయతీ కార్యాలయం, పాఠశాల భవనాలు, వృద్ధాశ్రమాల్లో ఏర్పాటు చేస్తారు. అర్హుల సంఖ్యను బట్టి ఈ కేంద్రాలను ఎక్కడ ఏర్పాటు చేయాలనేది జిల్లా టాస్క్ఫోర్స్ (డీటీఎఫ్), అర్బన్ టాస్క్ ఫోర్స్ (యూటీఎఫ్) నిర్ణయిస్తాయి. ఈ కేంద్రాలకు వ్యాక్సిన్ సమకూర్చడం, సిబ్బందిని కేటాయించడం వంటి బాధ్యతలు ప్రస్తుత సీవీసీ ఇన్చార్జిలు నిర్వహించాలి.
ఎక్కువ కేసులున్న జిల్లాల్లో ఆంక్షలు కఠినం
కరోనా కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని రాష్ర్టాలకు కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ గురువారం తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. లాక్డౌన్ విధించాలని నిర్దేశించనప్పటికీ కరోనా రోగుల సంఖ్య అధికంగా ఉన్న జిల్లాల్లో స్థానికంగా పటిష్ఠ కట్టడి చర్యలు చేపట్టాలని పేర్కొంది. ప్రస్తుతం అనుసరిస్తున్న ఇతర మార్గదర్శకాలను జూన్ 30 వరకు కొనసాగించాలని సూచించింది. కరోనా పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువ ఉన్న లేదా దవాఖానల్లో పడకల ఆక్యుపెన్సీ 60 శాతం కంటే ఎక్కువ ఉన్న జిల్లాలను గుర్తించాలని గత వారం రాష్ర్టాలను కేంద్రం కోరింది. ఇలాంటి జిల్లాల్లో ఆంక్షలను కఠినంగా అమలు చేయాల్సి ఉంటుందని తెలిపింది.