లక్నో : ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌరాసి ప్రాంతంలో వేగంగా దూసుకువచ్చిన ఎస్యూవీ వాహనం నియంత్రణ కోల్పోయి రెండు ద్విక్ర వాహనాలు, సైకిలిస్ట్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా ఐదుగురు మృతి చెందారని పోలీసులు పేర్కొన్నారు. బైక్లు, సైకిల్ను ఢీకొట్టిన అనంతరం ఎస్యూవీ చెట్టును ఢీకొట్టి.. ఆ తర్వాత కలిమిట్టి దబౌలి గ్రామంలోని ఓ గుంతలో పడిపోయిందని ఎస్పీ ఆనంద్ కులకర్ణి తెలిపారు. ఇక్కడ మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారని, వారిని హాస్పిటల్కు తరలించామని పేర్కొన్నారు.
ఈ సంఘటనలో మరణించిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన వారే ముగ్గురు ఉన్నారని.. రాకేశ్ (35), అతని తండ్రి రాజారామ్ (65), రితిక్ (5)గా గుర్తించారు. ప్రమాదంలో మృతి చెందిన మరో ఇద్దరిని ఆశిష్ (25), సౌరభ్ (38)గా గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన అనంతరం ఎస్యూవీ డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడని, అతన్ని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. మృతులకు రూ.2లక్షల ఎక్స్గ్రేషియా, గాయపడ్డ వారికి రూ.50వేల ఆర్థిక సాయం ప్రకటించారు.