న్యూఢిల్లీ : ఈ నెల ఒకటో తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 5.86 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్లను ఉచితంగా సరఫరా చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. జిల్లా పరిపాలన జూన్ మధ్య కాలం వరకు ప్రణాళిక చేసుకోవాలని, కేంద్రాల్లో రద్దీని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. కేంద్రం కోటా కింద రాష్ట్రాలకు 5.86 డోసులు అందజేయనున్నట్లు చెప్పింది. 75శాతం డోసులు 45పైబడిన జనాభాకు రెండో మోతాదులు, 30 శాతం మొదటి మోతాదులు ఇందులో ఉండనున్నాయి. 18-44 ఏళ్ల వయస్సు వారికి కేంద్రం వ్యాక్సిన్లు సరఫరా చేయడం లేదు.
రాష్ట్రాలు కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్ తయారీదారుల నుంచి నేరుగా సేకరించేందుకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 16 నుంచి 31 మధ్యలో 1.92 కోట్ల మోతాదులు సరఫరా చేయనున్నట్లు కేంద్రం పేర్కొంది. ఇందులో 162.5 లక్షల మోతాదుల కొవిషీల్డ్, 29.49 లక్షల మోతాదు కొవాగ్జిన్ డోసులున్నాయని తెలిపింది. జూన్ వరకు సరఫరా చేయనున్న వ్యాక్సిన్లకు సంబంధించి స్పష్టమైన సమాచారాన్ని రాష్ట్రాలకు అందజేశామని, డ్రైవ్ను విజయవంతం చేసేందుకు స్పష్టమైన ప్రణాళిక సిద్ధం చేయాలని రాష్ట్రాలను కోరినట్లు బుధవారం కేంద్రం చెప్పింది. వ్యాక్సినేషన్ సెంటర్లు తమ వ్యాక్సినేషన్ క్యాలెండర్ను ముందుగానే కొవిన్ ప్లాట్ఫామ్పై తెలుపాలని సూచించింది.