అమరావతి : ఏపీలో ఐదేండ్ల పాటు తప్పులు చేసిన అధికార పార్టీ నాయకులకు బేడీలు వేసి జైళ్లో ఊచలు లెక్కపెట్టిస్తామని తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు (Chandrababu) అన్నారు. గురువారం అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో పవన్ కల్యాణ్తో కలిసి ఎన్డీయే అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ (Jagan) పై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని, ఈ తిరుగుబాటే జగన్ ను ఇంటికి పంపిస్తుందని అన్నారు.
సీఎం జగన్కు చెల్లి, తల్లి్ ఎందుకు దూరమయ్యారో చెప్పాలని, జగన్కు వాడుకోవడం, వదిలేయడం అలవాటని ఆరోపించారు. 2014లో తండ్రి వైఎస్సార్ మరణం, 2019లో బాబాయి వైఎస్ వివేకానందా రెడ్డి(YS Viveka) హత్యను, కోడికత్తి డ్రామాను సానుభూతిగా మలుచుకున్నాడని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లోనూ గులకరాయి ఘటనతో జగన్ అమాయకపు ముఖం పెట్టి సానుభూతికి యత్నిస్తున్నారని దుయ్యబట్టారు.
భూ దందాలు , మద్యం వ్యాపారంతో పెద్దిరెడ్డి కుటుంబం రౌడీయిజం చేస్తోందని, ఆ కుటుంబాన్ని జిల్లా నుంచి తరిమేయాలి పిలుపునిచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాభిప్రాయంతోనే పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. అన్నమయ్య ప్రాజెక్టును బాగు చేసి బాధితులను అండగా ఉంటామని అన్నారు. గాలేరు-నగరి కాలవను పూర్తి చేసి కృష్ణా జలాలు అందిస్తామని హామీ ఇచ్చారు.