Plastic Currency : దేశంలో త్వరలో ప్లాస్టిక్ లేదా పాలిమర్ కరెన్సీ నోట్స్ (Plastic or Polymer Currency Notes) అందుబాటులోకి రానున్నాయి. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం (Union Govt) కీలక ముందడుగు వేసింది. రూ.10, రూ.20 విలువ కలిగిన ప్లాస్టిక్ లేదా పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రయోగాత్మకంగా పరీక్షిద్దామని భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి (Union Finance Minister) పంకజ్ చౌదరి (Pankaj Choudhary) సోమవారం లోక్సభ (Lok Sabha) లో ఒక లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.
ఈ ప్రయోగాల్లో భాగంగా రూ.10, రూ.20 డినామినేషన్లలో వంద కోట్ల చొప్పున పాలిమర్ నోట్లను ఆర్బీఐ జారీ చేయనుంది. భారతీయ వాతావరణ పరిస్థితుల్లో ఈ నోట్ల మన్నిక, పనితీరును పరిశీలించడమే ఈ క్షేత్రస్థాయి పరీక్షల ప్రధాన ఉద్దేశం. ఈ ప్రయోగాలు విజయవంతమైతేనే వీటిని దేశవ్యాప్తంగా విస్తృతస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడంపై తుది నిర్ణయం తీసుకుంటారు. అయితే, ప్లాస్టిక్ పాలిమర్ నోట్లను ప్రవేశపెడుతున్నంత మాత్రాన ప్రస్తుతం చలామణిలో ఉన్న కాగితపు నోట్లను రద్దుచేసే ప్రతిపాదన ఏదీ లేదని ప్రభుత్వం స్పష్టంచేసింది.
కాగితపు నోట్లతో పాటే పాలిమర్ నోట్లు కూడా సమాంతరంగా చెలామణిలో ఉంటాయని మంత్రి వివరించారు.
సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లు ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉంటాయని, ఇవి సులభంగా పాడవవని ఆర్బీఐ పేర్కొన్నది. ముఖ్యంగా తక్కువ విలువ కలిగిన నోట్లు త్వరగా చిరిగిపోతుండటంతో వాటిని తరచూ మార్చాల్సి వస్తోంది. పాలిమర్ నోట్ల వినియోగంవల్ల ముద్రణ, నిర్వహణ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది.