న్యూఢిల్లీ : దేశ రాజధానిలోని జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పని చేస్తున్న నబీలా సాదిక్ (38) కరోనాతో కన్నుమూశారు. ఇంతకు ముందు ఈ నెల 7న ఆమె తల్లి నుజాత్ (76) సైతం కరోనా సంబంధిత సమస్యలతో మృతి చెందింది. నబీలా సాదిక్ తనకు ఐసీయూ బెడ్ కావాలంటూ ఈ నెల 4న ట్వీట్ చేసింది. అదే రోజు కొద్ది గంటల తర్వాత ‘గాట్ ఇట్’ అంటూ ట్వీట్ చేసింది. ఆమె విద్యార్థులు, మిత్రులు అల్-షిఫా దవాఖానలో బెడ్ ఏర్పాటు చేయించారు. అక్కడ ఆమె కరోనా పాజిటివ్గా పరీక్షించారు. ఆ తర్వాత ఆమెను ఫరాబాద్లోని ఓ ఆసుపత్రికి తరలించగా.. సోమవారం రాత్రి కన్నుమూశారు.
అల్-షిఫా దవాఖానలో చేర్పించిన సమయంలో సిటీ స్కాన్ చేయగా.. ఊపిరితిత్తులు 21శాతం దెబ్బతిన్నాయని తేలింది. ఆమె చిన్ననాటి నుంచి ఉబ్బసం ఉందని, దీంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందని వర్సిటీ మాజీ విద్యార్థి మహ్మద్ వకార్ తెలిపారు. దవాఖాన నుంచి 7న ఆమెను ఫరీదాబాద్లోని హాస్పిటల్కు తరలించగా.. బిపాప్, ఎన్వీఐ తర్వాత వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె చాలా మంచి వ్యక్తి అని, స్నేహితులు, బంధువులందరికీ స్నేహపూర్వకంగా మెదులుతుందని చెప్పారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో కనీసం తల్లి మరణించిందన్న సమాచారం చెప్పలేదని పేర్కొన్నారు.
ఆమె తండ్రి సాదిక్ సైతం కరోనా వైరస్కు పాజిటివ్గా పరీక్షించగా.. కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మంగళవారం నబీలా మృతిపై పక్కింటి వారు ఆయనకు సమాచారం అందించగా కన్నీటి పర్యంతమయ్యారు. సాదిక్ అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో, ఆ తర్వాత జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పని చేశారని వకార్ తెలిపారు. నబీలా మృతికి జేఎన్యూ ఎస్యూ మాజీ అధ్యక్షుడు ఐషే ఘోష్, రిటైర్డ్ ప్రొఫెసర్ కమల్ చెనోయ్, విద్యార్థులు సంతాపం ప్రకటించారు.