తిరువనంతపురం : కేకే శైలజ.. ఈ పేరు దాదాపు అందరికీ సుపరిచితమే. కేరళ ఆరోగ్యశాఖ మంత్రిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. నిఫా వైరస్, కరోనా కాలంలో అవిశ్రాంతంగా పనిచేసిన సమర్థ నేతగా పేరు తెచ్చుకున్నారు. కేరళలో కరోనా కట్టడిలో ప్రధాన భూమిక పోషించారు ఈ మాజీ టీచర్. ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి అధికార పీఠం నిలబెట్టుకుంది. సీఎం పినరయి విజయన్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆరోగ్య మంత్రి పదవి మళ్లీ శైలజనే వరిస్తుందని అంతా భావించారు.
కానీ, కేబినెట్లో పతనంతిట్ట జిల్లా ఆరన్మూల నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలుపొందిన వీణ జార్జికి చోటు దక్కించుకొని, ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపడుతారని తెలుస్తోంది. అయితే, కేకే శైలజకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై సీఎం విజయన్ స్పందించారు. మంత్రివర్గం నుంచి శైలజను తప్పించే నిర్ణయం పార్టీ తీసుకున్నట్లు బుధవారం పేర్కొన్నారు. కేరళలో కొవిడ్ మొదటి వేవ్ను సమర్థవంతంగా నిర్వహించినందుకు ప్రశంసలు పొందినా మినహాయింపు ఇవ్వలేమని అన్నారు. గత ప్రభుత్వంలో ఇతర మంత్రులు సైతం మంచి పనితీరు కనబరిచిన వారున్నారన్నారు. వరుసగా రెండుసార్లు ఎవరినీ మంత్రులుగా చేయొద్దనేది పార్టీ నిర్ణయం. ఈ మేరకు ఆమెను మంత్రివర్గంలోకి తీసుకోలేదని స్పష్టం చేశారు.
పార్టీ నన్ను కోరిన మేరకు సీఎంగా కొనసాగుతున్నానని, కొత్త మంత్రులు సైతం మంచి పనితీరు కనబరుస్తారన్నారు. విజయన్ మంత్రివర్గంలో అత్యంత ప్రజాదరణ పొందిన మంత్రుల్లో కేకే శైలజ ఒకరు. కన్నూర్లోని మత్తన్నూర్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో 67,013 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో శైలజ అభ్యర్థిత్వం ఎల్డీఎఫ్కు నమ్మకమైన విజయాన్ని సాధించేందుకు సహాయపడిందని చాలా మంది పార్టీ నేతలు భావిస్తున్నారు. శైలజను మళ్లీ మంత్రిగా తీసుకోవాలని వామపక్ష మద్దతుదారులు సహా పలువురు ప్రముఖులు డిమాండ్ చేశారు. అయితే, శైలజ చీఫ్విప్గా బాధ్యతలు స్వీకరించనున్నారని తెలుస్తోంది.