Afgan vs Pak : పాకిస్థాన్ (Pakistan), ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan) దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. పాకిస్థాన్ భూభాగంపై ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ (Talibans) దళాలు డ్రోన్లతో దాడులు చేశాయి. పాకిస్థాన్లోని బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులలోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. ఇవి ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ (ఐసిస్-కే) ఉగ్రవాద సంస్థ స్థావరాలని, వాటిని ధ్వంసం చేసేందుకే దాడులు చేశామని తాలిబన్ ప్రభుత్వం (Taliban Govt) ప్రకటించింది.
పాకిస్థాన్పై దాడులను తాలిబన్లు సమర్థించుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్లో పౌరులపై దాడులు, విద్రోహ చర్యలకు ఈ స్థావరాల నుంచి ప్రణాళికలు రచిస్తున్నారని ఆరోపించారు. ఆఫ్ఘనిస్థాన్కు చెందిన ‘టోలోన్యూస్’ కథనం ప్రకారం.. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని ఓ పాఠశాలను ఐసిస్ ఉగ్రవాదులు రహస్య స్థావరంగా వాడుకుంటున్నారని, అందుకే దానిపై దాడి చేశామని తాలిబన్లు పేర్కొన్నారు. ఈ వైమానిక దాడుల్లో పలువురు ఐసిస్ సభ్యులు హతమయ్యారని, పౌరులకు ఎలాంటి హాని జరగలేదని ఆఫ్ఘన్ ప్రభుత్వం స్పష్టంచేసింది.
రెండు రోజుల క్రితం ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో పాకిస్థాన్ భీకర వైమానిక దాడులు జరిపింది. ఈ దాడులకు ప్రతీకారంగానే తాలిబన్లు తాజా దాడులకు దిగినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ జరిపిన దాడుల్లో భారీగా పౌరులు మరణించారని ఆఫ్ఘన్ ప్రభుత్వం ఆరోపించింది. ఐక్యరాజ్యసమితి ప్రకారం.. ఈ దాడుల్లో 28 మంది పౌరులు మరణించగా, 49 మంది గాయపడ్డారు. అయితే తాము జరిపిన వైమానిక, భూతల ఆపరేషన్లలో 29 మంది ఉగ్రవాదులను హతమార్చామని పాకిస్థాన్ భద్రతాదళాలు ప్రకటించాయి. మరోవైపు ఆఫ్ఘన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రత్ మాట్లాడుతూ.. పాక్ దాడుల్లో 38 మంది పౌరులు చనిపోయారని, వీరిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారని తెలిపారు.
ఇదిలావుంటే.. ఆఫ్ఘనిస్థాన్పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులను భారత్ సోమవారం తీవ్రంగా ఖండించింది. ఇది ఆఫ్ఘన్ సార్వభౌమత్వంపై జరిగిన దాడి అని, ప్రాంతీయ శాంతికి ప్రత్యక్ష ముప్పు అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొన్నది. పాకిస్థాన్ తన అంతర్గత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, బాధ్యతల నుంచి దృష్టి మరల్చడానికి సరిహద్దుల ఆవల ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడటం ఆందోళనకరమని భారత్ విమర్శించింది. కాగా, కొంతకాలంగా ఇరుదేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయి. తమ దేశంలో దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులకు ఆఫ్ఘనిస్థాన్ ఆశ్రయం కల్పిస్తోందని పాకిస్థాన్ ఆరోపిస్తుండగా.. ఈ ఆరోపణలను తాలిబన్లు ఖండిస్తున్నారు.