తిరుమల : తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారికి జరిగే నిత్య, వారసేవలు, ఉత్సవాలను ఇతర ప్రాంతా ల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా టీటీడీ ఆయా ప్రాంతాల్లో వైభవోత్సవాలను నిర్వహిస్తుంది . ఇందులో భాగంగా ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో వైభవోత్సవాలను జరుప నున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు వైభవోత్సవాల వివరాలను వెల్లడించారు.
10న ఈ ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని వివరించారు. ఐదు రోజుల పాటు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిత్య కైంకర్యాలు నిర్వహిస్తామని తెలిపారు. వారపు సేవల్లో భాగంగా అక్టోబరు 11న వసంతోత్సవం, 12న సహస్ర కలశాభిషేకం, 13న తిరుప్పావడ, 14న నిజపాద దర్శనం, 15న సాయంత్రం 6.30 నుంచి 8.30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం జరుగుతుందని చెప్పారు.
కార్తీక మాసంలో గత ఏడాది తరహాలో విశాఖపట్నం, కర్నూలు జిల్లా యాగంటిలో కార్తీక దీపోత్సవాలు నిర్వహిస్తామని టీటీడీ అధికారులు వెల్లడించారు. డిసెంబరులో ప్రకాశం జిల్లా ఒంగోలులో, జనవరిలో ఢిల్లీలో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఉత్తరాయణంలో చెన్నైలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, జమ్మూలోని శ్రీవారి ఆలయాలకు మహాసంప్రోక్షణ జరుగుతుందని వివరించారు.