న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) పోలింగ్ శాతంపై ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం (ఈసీ) విడుదల చేసిన ఓటింగ్ డేటాలో వ్యత్యాసాలు ఉన్నాయని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ విశ్వసనీయత అత్యల్పంగా ఉందని విమర్శించారు. ‘ఇండియా’ బ్లాక్ నేతలకు ఆయన రాసిన లేఖను ఎక్స్లో పోస్ట్ చేశారు.
కాగా, మల్లికార్జున్ ఖర్గే ఆరోపణలు, విమర్శలపై ఎన్నికల సంఘం (ఈసీ) మండిపడింది. ఓటర్లలో గందరగోళం సృష్టించేలా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగే ఎన్నికలకు ఆటంకం కలిగించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించింది. స్వేచ్ఛగా మాట్లాడే హక్కును ఈసీ గౌరవిస్తుందని పేర్కొంది. అయితే ఫలితాలు వెలువడే వరకు ఎన్నికల నిర్వహణ, ఆదేశాలపై ప్రభావాన్ని చూపే పరిణామాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా తమకు ఉందని గుర్తు చేసింది.
మరోవైపు మల్లికార్జున్ ఖర్గే ఆరోపణలను తోసిపుచ్చిన పోల్ ప్యానెల్ అలాంటి ప్రకటనలు మానుకోవాలని సూచించింది. శుక్రవారం ఈసీ ఈ మేరకు ఘాటుగా ఆయనకు లేఖ రాసింది.