Kondapur | కొండాపూర్, మే 9 : ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 48 గంటలుగా కరెంటు లేక తీవ్ర అవస్థలుపడుతున్నారు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పాపిరెడ్డి కాలనీవాసులు. మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి కాలనీలోని చెట్లు, కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ విరిగిపడ్డాయి. అయితే కాలనీలో పడిపోయిన ట్రాన్స్ఫార్మర్ను పునరుద్ధరించిన అధికారులు.. కనెక్షన్ ఇవ్వకపోవడంతో రెండ్రోజులుగా కాలనీ అంధకారంలో ఉంటున్నది. తారానగర్ సబ్స్టేషన్ అధికారులకు సమస్య విన్నవించుకున్నా.. ఎలాంటి స్పందన లేకుండాపోయిందని కాలనీవాసులు వాపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇంతకంటే ఎక్కువగా ఈదురు గాలులు, భారీ వర్షాలు పడ్డాయని, గంటల వ్యవధిలోనే సమస్యను పరిష్కరించి, కరెంట్ సరఫరాను పునరుద్ధరించేవారని కాలనీవాసులు పేర్కొంటున్నారు.
రెండు రోజులుగా పాపిరెడ్డి కాలనీలో కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఈదురుగాలులకు పడిపోయిన ట్రాన్స్ఫార్మర్ను అధికారులు పునరుద్ధరించారు. కానీ కనెక్షన్ మాత్రం ఇవ్వలేదు. దీంతో పాటు కాలనీలో విరిగిపడిన చెట్లను తొలగించడం లేదు. పిల్లలు, వృద్ధులు మంచినీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం బాత్రూమ్కు వెళ్లాలంటే.. నీళ్లు లేక అవస్థలుపడుతున్నారు. అధికారులకు అనేకసార్లు ఫోన్లు చేసినా.. స్పందించడం లేదు.