జగిత్యాల, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ)/మల్యాల : మూత్ర విసర్జన కోసం స్కూల్ నుంచి బయటకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్యాలలో సోమవారం చోటుచేసుకున్నది. మల్యాల పోలీసుల కథనం ప్రకారం.. మల్యాలలోని ఒడ్డెర కాలనీలో గల సమీకృత వసతిగృహంలో ఉంటూ స్థానిక మండల ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న జగన్నాథ సుశాంత్(10), ఐదోతరగతి విద్యార్థి వనం విష్ణు (11) మధ్యాహ్నం 3 గంటల సమయంలో మూత్ర విసర్జన కోసం బయటకు వెళ్తామని ఉపాధ్యాయుడు విఠల్ అనుమతి కోరారు.
పాఠశాలలోని మూత్రశాలలు, మరుగుదొడ్లు వినియోగించుకోలేని స్థితిలో ఉండటంతో బయటకు అనుమతించారు. వెళ్లిన పిల్లలు అరగంట గడిచినా రాకపోవడంతో ఆందోళన చెందిన ఉపాధ్యాయుడు పలు ప్రాంతాల్లో వెతికారు. కొత్తకుంట చెరువు వద్ద ఇద్దరు పిల్లల దుస్తులు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు వచ్చి గజ ఈతగాళ్లతో వెతికించారు. అరగంట తర్వాత చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. విద్యార్థుల మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.