KTR | మేడ్చల్/మల్కాజిగిరి: హైదరాబాద్ను జూన్ 2 తర్వాత కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం ఓల్డ్ అల్వాల్లోని వీబీఆర్ ఫంక్షన్ హాల్లో యువ సమ్మేళనంలో కేటీఆర్ ప్రసంగిస్తూ.. హైదరాబాద్ యూటీ అయితే అభివృద్ధి ఆగిపోతుందన్నారు. ఈ కుట్రలను అడ్డుకోవాలంటే బీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో ఉండాలన్నారు. ఐదు నెలల్లో రేవంత్రెడ్డి చేసిందేమీటంటే చిల్లర మాటలు, ఉద్దెర పనులని కేటీఆర్ అన్నారు. ‘అర చేతిలో వైకుంఠం చూయించి.. చెప్పిదాంట్లో ఒక్కటైనా అమలు చేసి చూయించాడా’ అని ప్రశ్నించారు. కరెంట్, నీళ్లు ఇచ్చుడు చేతనైతలేదు..కానీ విలన్లు చెప్పినట్లు డైలాగులు చెబుతున్నారన్నారు.
‘కాంగ్రెస్ ఇస్తానన్న ఆరు గ్యారెంటీలు ఏమిటంటే..జనరేటర్లు, ఇన్వటర్లు, క్యాండిల్ లైట్లు, టార్చిలైట్లు, పవర్బ్యాంక్, చార్జింగ్ బల్పులు’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ గ్రేటర్ వాసులు కాంగ్రెస్ హామీలను నమ్మలేదని.. గ్రామాల్లోని ప్రజలు నమ్మి మోసపోయారన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అని అనుకునేటోళ్లు బీఆర్ఎస్కు 10 నుంచి 12 ఎంపీ సీట్లు ఇస్తే..కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారని చెప్పారు. హైదరాబాద్లో ఉన్న కంపెనీలను కాపాడుకునే చేతనైతలేదని, ఇంకా కొత్త కంపెనీలు వచ్చే పరిస్థితి లేదన్నారు. పారిపాలన చేతకాని వాళ్లకు అవకాశం ఇస్తే నష్టపోయేది మనమేనన్నారు.
మల్కాజిగిరి పార్లమెంటు బరిలో నాన్లోకల్ అభ్యర్థులు నిలిచారని, వారికి ఇక్కడి ప్రజలు ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలన్నారు. పొలిటికల్ టూరిస్టులు.. ఒకరు హుజురాబాద్, మరొకరు చేవెళ్ల నుంచి వచ్చారన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాత్రమే ఎప్పుడు అందుబాటులో ఉంటారన్నారు. రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి.. ఢిల్లీలో తెలంగాణ గొంతుక వినపడేలా చూడాలని యువతకు కేటీఆర్ పిలుపునిచ్చారు. దయచేసి లాంగ్ వీకెండ్ ఉన్నదని, యువత ఓటు వేయకుండా ఉండవద్దని కేటీఆర్ సూచించారు. ‘మీరు ఓటు వేయకపోతే మీకు ఇష్టం లేని లంగ, దొంగ నాయకులు రాజ్యమేలుతారు’ అని అన్నారు. ఓటు హక్కును వినియోగించుకుని బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదన్నారు.
-మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. ప్రజల కోసం పనిచేసేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనన్నారు. 13న జరిగే పోలింగ్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించేలా కారు గుర్తుకు ఓటు వేయాలన్నారు.
-ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి
మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత మనపైనే ఉన్నదని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ప్రజలు ఆలోచించి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు.