Sankranti Special | మూడు రోజుల పండుగ ముగిసింది. సంక్రాంతి శోభ మాత్రం మరో ఆరు నెలలు కొనసాగనుంది. ఉత్తరాయణ కాలం.. ఈ లోకానికి కొత్త బలాన్ని ఇవ్వనుంది. సూర్యుడి ఉత్తర గమనం.. మానవాళిని ఉత్తమ గమ్యం వైపు నడిపించనుంది.
మనిషి జీవితం పూర్తిగా ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది. రాబోయే కాలంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో వాటిని ముందుగానే ఊహించి, అందుకు అనుగుణంగా తమ జీవన విధానాలను తీర్చిదిద్దుకునే సంస్కృతి మనది. మనిషి ప్రకృతి నియమాలకు అనుగుణంగా జీవించాలని, ప్రకృతిని ఆశ్రయించాలే కానీ ఆక్రమించకూడదనే సత్యాన్ని నిరంతరం మనిషికి ప్రకృతే స్వయంగా బోధిస్తుంది. వీటన్నిటి ఆచరణాత్మక రూపమే పండుగలు. ఈ క్రమంలో మనిషి భావి జీవితం పట్ల జాగరూకత కలిగి ఉండేలా చేసే కాలపరమైన అంశాల్లో ఉత్తరాయణం అత్యంత ప్రధానమైన అంశం.
ప్రతి మనిషిలోనూ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే తన్మాత్రలుగా పంచభూతాలు అంతర్లీనంగా ఉంటాయి. ఇవే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే రూపాల్లో బాహ్యంగా పంచభూతాలుగా ప్రకటితమవుతాయి. ఇలా అంతర్బహిర్ రూపాల్లో ఉన్న పంచభూతాలను మనో నేత్రంతో దర్శించి, లౌకిక జీవనాన్ని సాఫల్యం చేసుకుంటూనే కైవల్యానికి సోపానాలు నిర్మించుకోవాల్సిన బాధ్యత మనిషిపై ఉంది. దైనందిన జీవనంలోని ప్రతి అడుగులో ప్రకృతిని అనుసరిస్తూ, ‘ప్రకృతి’, ‘శక్తు’ల మేలు కలయికగా జీవనలక్ష్యాన్ని చేరుకోవాలనేది మన ప్రాచీనుల దిశానిర్దేశం. ఈ బాధ్యతల నిర్వహణలో మనిషికి చేయూత అందించేందుకు మన ప్రాచీనులు ‘కాల’ విభజన చేశారు. ఈ క్రమంలో భారతీయ జీవనంలోని అత్యున్నత వైజ్ఞానిక కోణాన్ని సమున్నతంగా ఆవిష్కరించే కాలగమన సూచిక ఉత్తరాయణం.
సంక్రాంతి వేళ మూడు రోజుల పండుగతో మొదలయ్యే ఉత్తరాయణ పుణ్యకాలం ఆరు నెలలపాటు కొనసాగుతుంది. గ్రహాధిపతి అయిన సూర్యుడి గమనం దక్షిణం నుంచి ఉత్తరానికి మారే కాలమే ఉత్తరాయణం. మనిషిని ఆధ్యాత్మికంగా సర్వోన్నతుడిగా తీర్చిదిద్దే కాలం ఇది. ఉత్తరాయణం పుణ్యకాలం అంటే దక్షిణాయనం పాపకాలం అని అర్థం చేసుకోకూడదు. దక్షిణాయనం కూడా పుణ్యప్రదమే. అయితే ఉత్తరాయణం విశిష్టత ఎక్కువగా ఉంటుంది. ఇందుకు అనేక ఆధారాలు ఉన్నాయి.
☛ పుణ్యస్నానాలకు మకర మాసం (చాంద్రమానం ప్రకారం రానున్న మాఘం) ప్రముఖమైనది. ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి ప్రారంభించి నదీ స్నానాలు చేస్తారు. వీటిని అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. మాఘ మాసంలో పుణ్యనదిలో స్నానం చేస్తే విశేష ఫలితం కలుగుతుంది. కుదరని వారు తమ ఇంట్లోనే భగవంతుడి నామాన్ని స్మరిస్తూ స్నానం చేసినా తీర్థస్నాన ఫలితం దక్కుతుంది.
☛ పవిత్రమైన, శాస్త్రోక్త సత్కర్మలకు ఉత్తరాయణం ప్రధానమైందని ఆగమాలు చెబుతున్నాయి. శుద్ధికి, సిద్ధికి శీఘ్రఫలకారిగా అనుకూలించే సమయమిది. ఆలయాల్లో దేవతామూర్తులను ప్రతిష్ఠ చేయటానికి ఈ సమయం యోగ్యమైందని పేర్కొన్నారు. యంత్రాల ద్వారా దేవతాశక్తిని ఆలయంలో నిక్షిప్తం చేయటానికి ఈ కాలంలో జరిగే గ్రహ సంచారం ఎంతో అనుకూలంగా ఉంటుంది.
☛ తెలుగువారి తొలి పండుగ ఉగాది ఉత్తరాయణం, చైత్రమాసంలో వస్తుంది. మోడువారిన ‘మోడు’లతో పాటు మానవ జీవితాలను సైతం చైతన్యవంతం చేసే మాసం ఇది. చైత్రం రాకతో తరువులు చిగురించినట్లే మానవ హృదయాల్లో వైరుధ్యాలు, వైషమ్యాలు తొలగి, నవ జీవనకాంతులు
ప్రసరిస్తాయి.
☛ దేవీ భాగవతం లక్ష్మీ ఆరాధనను ప్రధానంగా చెబుతుంది. సూర్యకాంతిలో పెరిగే ఆధిక్యం, శక్తి… ఈ రెండూ సౌరశక్తి విశేషాలు. వాటిలో దైవీశక్తిని గ్రహించిన మహర్షులు ఉత్తరాయణంలో సూర్యుడి ఉపాసన చేయాలని ప్రముఖంగా పేర్కొన్నారు. సూర్యుణ్ని నారాయణుడిగా, శోభను, శక్తిని పోషించే ఆయన మహిమను ‘లక్ష్మి’గా భావించి ఆరాధిస్తారు.
☛ ఉత్తరాయణంలో లయ కారకుడైన పరమశివుడు మేలుకొని ఉంటాడు. ఈ కాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటం వల్ల పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలకు అనుకూలం. సాధారణ వ్యవహారంలోనూ ఉత్తర దిక్కునూ, ఉత్తర భూములనూ పవిత్రంగా భావించడం అలవాటు.
☛ ఉత్తరాయణ కాలంలోనే చెట్లు కొత్త చిగుళ్లు తొడిగి, పుష్పించి, కాయలు కాచి మధుర ఫలాలు అందిస్తాయి. స్త్రీ, పురుషుల మధ్య పరస్పర ఆకర్షణ ఎక్కువగా ఏర్పడేది ఈ కాలంలోనే అని విజ్ఞానశాస్త్రం చెబుతున్నది.
ఉత్తరాయణం ప్రారంభమైన తర్వాత వాతావరణంలో స్పష్టమైన మార్పులు గోచరిస్తాయి. అప్పటివరకు వణికించిన చలి మెల్లగా తగ్గుముఖం పడుతుంది. సమశీతోష్ణ స్థితి నెలకొంటుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఉత్తరాయణ పుణ్యకాలం సమస్త మానవాళికి పుణ్యప్రదం.
సూర్యుడి గమనంలో ఉత్తరాయణం దేవతలకూ, పితృ దేవతలకూ సంతుష్టిని చేకూర్చి మానవజన్మకు సార్థకం కలిగిస్తుంది. భీష్ముడు కురుక్షేత్ర సంగ్రామంలో కుప్పకూలినా స్వచ్ఛంద మరణ వర ప్రభావంతో ఉత్తరాయణం వచ్చే వరకు చివరి ఊపిరి విడువలేదు. కన్నుమూయడానికి ముందు ధర్మరాజుకు విష్ణు సహస్రనామాలు ఉపదేశించి మానవాళికి మహోపకారం చేశాడు. ధార్మిక చింతనకు ఉత్తరాయణం పుణ్యప్రదం అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఉత్తరాయణ కాలంలో స్వర్గద్వారాలు తెరచి ఉంటాయి. పితృకార్యాలకూ ఈ కాలం విశేషమైనది. ఉత్తరాయణంలో మరణించిన వారికి పరమపదం కలుగుతుందని భగవద్గీతలో సాక్షాత్తూ శ్రీకృష్ణ భగవానుడు పేర్కొనడం విశేషం.
‘ఆగ్నేనయ సుపధారాయే అస్మాన్…’ అని అరుణ మంత్రం. ‘ఓ అగ్నిదేవుడా, మాకు మంచి మార్గాన్ని చూపించు’ అని ఈ మంత్రానికి అర్థం. జీవులు తాము చేసిన కర్మఫలాన్ని అనుభవించటానికి అనువుగా తగిన మార్గాన్ని చూపించమని అగ్నిదేవుడిని అడిగారట. ఆయన రెండురకాలైన మార్గాలు చూపించాడు. అందులో మొదటిది దేవయానం. కాంతి, వెలుగు ఇచ్చే మార్గంగా దీన్ని చెబుతారు. ఇదే ఉత్తరాయణం. రెండోది పితృయానం. ఇది చీకటి మార్గం, ధూమ మార్గం. అదే దక్షిణాయనం. వెలుగు మార్గంలో పయనించిన వారు, సూర్యుడి అనుగ్రహాన్ని పొందుతారు. ఈ తత్త్వాన్ని గ్రహించిన ఉపాసకులు ఉత్తరాయణ కాలాన్ని ఆధ్యాత్మిక సాధనకు వినియోగించుకుంటారు.
.. ✍ శ్రీ భారతి
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Abhishekam |అభిషేకం వేటితో చేస్తే శివుడికి ప్రీతికరం.. పాలతోనా? పెరుగుతోనా?
కాలం ముందు ఆ శివుడు అయినా లోబడి ఉండాల్సిందే.. ఇదే అందుకు నిదర్శనం
అమ్మవారికి నిమ్మకాయల హారం వేయడం వెనుక ఆంతర్యం ఏమిటి?
అయ్యప్ప దర్శనానికి స్వాములు ఇరుముడి ఎందుకు తీసుకెళ్తారు?
మొండి రోగాలను నయం చేసే వైద్యనాథుడి ఆలయం.. ఎక్కడో తెలుసా !