(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): ‘బేటీ బచావో..’ అంటూ నినాదమిచ్చిన బీజేపీ ప్రభుత్వ పాలనలో అడబిడ్డలకు భద్రత కరువయ్యింది. దేశంలో ప్రతీ 18 నిమిషాలకు ఒక రేప్ కేసు నమోదవుతున్నది. మహిళలపై జరిగే లైంగిక దాడుల్లో బీజేపీపాలిత రాష్ర్టాలే టాప్-5 స్థానాల్లో ఉన్నాయి. మొత్తంగా సగటున రోజుకు 1,210 మంది మహిళలపై నేరాలు చోటు చేసుకొంటున్నాయి. ఈ మేరకు ఇటీవల విడుదలైన జాతీయ నేర గణాంక విభాగం (ఎన్సీఆర్బీ-2024) నివేదిక కీలక విషయాల్ని వెల్లడించింది.
ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు విహరిస్తారని అంటారు. అయితే, బీజేపీ పాలనలో దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. 2024 ఒక్క ఏడాదిలోనే దేశవ్యాప్తంగా 4,41,534 మంది మహిళలపై దాడులు, అఘాయిత్యాలు జరిగాయి. మహిళలపై నేరాల్లో బీజేపీపాలిత రాష్ర్టాలు టాప్-3 స్థానాల్లో ఉండటం గమనార్హం. 66,396 కేసులతో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉండగా, 47,954 కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలో, 36,536 కేసులతో రాజస్థాన్ మూడో స్థానంలో నిలిచింది. మహిళలపై నేరాల్లో హత్యలు, లైంగిక దాడులు, లైంగిక వేధింపులు, కిడ్నాప్లు, గృహహింస, వరకట్న వేధింపులు తదితరాలు ప్రధానంగా ఉన్నాయి.
దేశంలో 2024 ఏడాదిలో మొత్తంగా 29,536 రేప్ కేసులు నమోదయ్యాయి. మహిళలపై లైంగిక దాడుల్లో బీజేపీపాలిత రాష్ర్టాలే టాప్-5 స్థానాల్లో ఉన్నాయి. రాజస్థాన్లో అత్యధికంగా 4,871 రేప్ కేసులు నమోదుకాగా, తర్వాతి స్థానాల్లో వరుసగా ఉత్తరప్రదేశ్ (3,209), మహారాష్ట్ర (3,091), మధ్యప్రదేశ్ (3,061), హర్యానా (1,391) ఉన్నాయి.
మహిళలపై జరిగే ప్రతీ 100 లైంగిక దాడుల్లో 97 కేసుల్లో నిందితులు బాధిత మహిళకు తెలిసిన వారే ఉంటున్నారని ఎన్సీఆర్బీ నివేదిక తెలిపింది. 2024లో నమోదైన మొత్తం 29,536 రేప్ కేసుల్లో 28,597 కేసుల్లోని నిందితులు బాధితురాళ్లకు తెలిసినవారుగా ఉన్నట్టు వెల్లడించింది. ఘాతుకానికి పాల్పడిన వారిలో 2,134 కేసుల్లో కుటుంబసభ్యులు, 13,879 కేసుల్లో స్నేహితులు, మాజీ భర్తలు, 12,584 కేసుల్లో ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఇరుగుపొరుగు, సహోద్యోగులు ఉన్నట్టు తెలిసింది.