సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రేజింతల్లో నిమ్జ్ ప్రాజెక్టు కోసం భూసేకరణ వ్యవహారంలో బాధిత రైతులకు రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. భూసేకరణ కోసం జారీ చేసిన నోటిఫికేషన్ను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి, సంబంధిత అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సంబంధిత జిల్లా అధికారులు నోటిఫికేషన్ను ఉపసంహరిం చుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ చేయడంతో శనివారం గ్రామంలో బాధిత రైతులు సంబురాలు చేసుకున్నారు.
జహీరాబాద్, ఆగస్టు 1: నిమ్జ్ ప్రాజెక్టు కోసం సారవంతమైన వ్యవసాయ భూములు బలవంతంగా స్వాధీనం చేసుకోవద్దని సంగారెడ్డి జిల్లా రేజింతల్ గ్రామ రైతులు కొన్నేండ్లుగా నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. నిమ్జ్ ప్రాజెక్టు కోసం అధికారులు గ్రామంలో 1880 ఎకరాల ప్రభుత్వ, పట్టా భూములు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో ఇప్పటికే అధికారులు ప్రభుత్వ భూములు సేకరించి బాధిత రైతులకు పరిహారం చెల్లించారు. మూడు పంటలు పండే సారవంతమైన భూములు సేకరిస్తే తమ జీవనాధారం దెబ్బతింటుందని, భూసేకరణ, పునరావాసం, పునర్వ్యవస్థీకరణ హక్కు చట్టం-2013 స్ఫూర్తికి విరుద్ధమని బాధిత రైతులు మొదటి నుంచి వాధిస్తున్నారు. ఈ విషయమై పలుసార్లు సంగారెడ్డి కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్, నిమ్జ్ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. అయినా వినకుండా అధికారులు బలవంతంగా భూసేకరణ చేపట్టేందుకు యత్నించగా, బాధిత రైతులు హైకోర్టును ఆశ్రయించారు. భూసేకరణపై బాధిత రైతులకు గతంలో హైకోర్టులో స్టే లభించింది.
స్టే ఉన్నప్పటికీ అధికారులు హైకోర్టును ఆశ్రయించిన రైతుల పేర్లు మినహాయించి, గ్రామంలోని 556.12 ఎకరాల రైతుల పట్టా భూములు సేకరించేందుకు ఈ ఏడాది జనవరిలో నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో బాధిత రైతులు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలు, భూసేకరణ చట్టాన్ని ఉల్లంగిస్తూ రాజకీయ ఒత్తిళ్లతో భూములు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని బాధిత రైతులు తమ పిటిషన్లో పేర్కొన్నారు. బాధిత రైతుల వాదనలు విన్న హైకోర్టు, రేజింతల్కు చెందిన 292 మంది రైతులకు సంబంధించిన 566.12 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జూలై 29న ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు రేజింతల్లో భూసేకరణ నోటిఫికేషన్ను వెనక్కి తీసుకుంటున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు.దీంంతో బాధిత రైతులు శనివారం ఆలయాల వద్ద కొబ్బరికాయలు కొట్టి, పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.