సిటీబ్యూరో, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టి దౌర్జన్యకాండకు దిగింది. మంగళవారం హైదరాబాద్లో అడుగడుగునా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. తెల్లవారుజామునే బీఆర్ఎస్ ఎమ్మెల్సీల ఇండ్లకు వెళ్లి తాతా మధు, నవీన్కుమార్రెడ్డిను అక్రమంగా అరెస్టు చేశారు. బీఆర్ఎస్ నాయకులు క్రిశాంక్ ఇంటికి వెళ్లి రౌడీయిజాన్ని ప్రదర్శించారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నాయకులపై దౌర్జన్యకాండకు దిగారు. పోలీసుల నోటీకి అడ్డూ అదుపులేకుండాపోయింది. బీఆర్ఎస్ నేతలపై పరుష పదజాలాన్ని ఉపమోగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టి బీఆర్ఎస్ నాయకులను అడ్డుకోవడం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కేసీఆర్పై చేసిన అభ్యంతకర వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పలు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు చేయడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తారోకో, ధర్నాలు, ఆందోళనలు చేయడంతో హైదరాబాద్ అట్టుడికింది.
కాంగ్రెస్కు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను బీఆర్ఎస్ ఎండగుడుతుందనే భయం పట్టుకుం ది. ఇలాంటి సమయంలోనే నామ మాత్రంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి.. మామ అన్పించేందుకు ప్రయత్నిస్తోందనే ఆరోపణలున్నాయి. ఇలాంటి సమయంలో అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ తమను ప్రజా సమస్యలపై నిలదీస్తుందనే భయాందోళనకు గురైన కాంగ్రెస్ నేతలు డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపారని జకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. సోమవారం నుంచి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అసెంబ్లీకి రాకుండా అడ్డుతగులుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇందుకు కొనసాగింపుగా మంగళవారం కూడా హైదరాబాద్లో పోలీసులను ముందు పెట్టి బీఆర్ఎస్ శ్రేణులపై దౌర్జన్యకాండ సాగించారని ప్రజలు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్రెడ్డిలను మంగళవారం ఉద యం అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరి అరెస్ట్తో ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఎమ్మెల్సీల అరెస్ట్ విషయాన్ని తెలుసుకొని భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు నారాయణగూడ ఠాణాకు చేరుకున్నారు. కాంగ్రెస్ ప్రభత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఇండ్లపై పోలీసులు దాడులు చేసి ఎక్కడికక్కడ నిర్బంధించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ నివాసానికి కార్ఖానా సీఐ అనురాధ వెళ్లారు. క్రిశాంక్ ఇంట్లో లేరని, చిన్న పాప ఉందని ఆయన కుటుంబ సభ్యులు చెప్పినా వినకుండా ఇంట్లో పనిచేసే సిబ్బందిపై పరుషపదజాలంతో విరుచుకుపడ్డారు. ఆపై క్రిశాంక్పై దౌర్జన్యానికి దిగారు.
ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ ముట్టడికి కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని, పలువురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా వెళ్తున్నారనే సమాచారంతో అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అక్కడకు బయలుదేరారు. దీంతో సికింద్రాబాద్ ప్రాంతంలోనే పోలీసులు వారిని అడ్డుకొని వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. ఏకంగా మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ రంగంలోకి దిగారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై దౌర్జన్యానికి దిగారు. ప్రజాప్రతినిధుల వాహనాలను అడ్డుకొని తీవ్ర పదజాలంతో పోలీసులు దౌర్జన్యకాండ సాగించారు. బోయిన్పల్లి పోలీస్స్టేషన్కు కేటీఆర్ ఇతర నాయకులను, జవహర్నగర్కు హరీశ్రావును తరలించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు వేలాదిగా అక్కడకు చేరుకున్నారు రోడ్డుపై బైఠాయించారు. బీఆర్ఎస్ శ్రేణులు రోడ్లపైకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంతలో కాంగ్రెస్ పార్టీ షదా ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు బారీ సంఖ్యలో ఆయా నాయకులు ఉన్న పోలీస్స్టేషన్ల వద్దకు చేరుకున్నారు. ఇంతలో షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ గ్రేటర్ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లలో సదరు కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆయనతో ఆ మాటలు అన్పించిన ముఖ్యమంత్రిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నగర వ్యాప్తంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.