వంటిమామిడి మార్కెట్ వద్ద కూరగాయల వ్యాపారం రోడ్డుపైకి రావడంలో నిత్యం రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. అసలే రద్దీగా ఉండే సిద్దిపేట జిల్లా వంటిమామిడి రాజీవ్ రహదారిపై తెల్లవారుజామునుంచి ఉదయం 11గంటల వరకు ట్రాఫిక్ను అదుపు చేయలేక పోలీసులు, మార్కెట్ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.
గజ్వేల్, ఆగస్టు 1: సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి కూరగాయల మార్కెట్ వద్ద ట్రాఫిక్ కష్టాలు ఎదురవుతున్నాయి. రోజూ ఉదయం మార్కెట్కు ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో కూరగాయల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. రైతులు పండించిన కూరగాయలు మార్కెట్లో విక్రయించేందుకు తెల్లవారుజాము 5 గంటల నుంచే ద్విచక్ర వాహనాలు, ఆటోల్లో తెస్తుంటారు. వంటిమామిడి మార్కెట్కు సమీపంలో కిలోమీటర్ దూరం నుంచి రైతుల వద్ద కూరగాయలు కొనుగోలుకు వాహనాలను వ్యాపారులు అడ్డంగా నిలుపుతున్నారు. రోడ్డుపైనే క్రయవిక్రయాలు బేరం చేస్తుండడంతో నిత్యం రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ సమస్య ఏర్పడుతున్నది.
దాటాలంటే గండమే…
వంటిమామిడి మార్కెట్ వద్ద ట్రాఫిక్ను అదుపు చేసేందుకు పోలీసులతో పాటు మార్కెట్ సిబ్బంది రోడ్డుపై ఉంటున్నా, ఎలాంటి ప్రయోజనం ఉండడం లేదు. ఉదయం జరిగే మార్కెట్తో హైదరాబాద్, సిద్దిపేట, కరీంనగర్, రామగుండం, జగిత్యాల పట్టణాలకు వెళ్లే వాహనదారులు రోడ్డుపై వెళ్లాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. రోడ్డుపై ఎక్కడ వ్యాపారులు వాహనాలకు అడ్డుతగులుతారోనని భయంతో ముందుకు సాగుతున్నారు. ఉదయం జరిగే మార్కెట్కు కరీంనగర్, సిద్దిపేట, నిర్మల్, కామారెడ్డి, బోయిన్పల్లి తదితర పట్టణాల నుంచి వ్యాపారులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఉదయం సమయంలో ఎక్కువ రద్దీ ఉండడంతో వంటిమామిడి మార్కెట్ ఎదురుగా తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు శాశ్వత పరిష్కార మార్గాలు చూపడం లేదు. దీంతో రోజురోజుకూ వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం సమయంలో హైదరాబాద్ వెళ్లే వాహనదారులు వంటిమామిడి మార్కెట్ వద్దకు రాగానే ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతున్నారు. ఉదయం ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, కంపెనీలకు చిరుద్యోగులు ఇదే మార్గంలో వెళ్తుంటారు. ఇప్పటికైనా అధికారులు ట్రాఫిక్ సమస్యతో పాటు రైతులు కూరగాయలు అమ్ముకునేందుకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుతున్నారు.