Abhishekam | అభిషేకం అనగానే ఏ ద్రవ్యాలతో చేయాలి? మామూలు నీళ్లతోనా? కొబ్బరి నీళ్లతోనా? ఫలరసాలతోనా? పాలు, పెరుగు, నెయ్యి, తేనె మొదలైన పదార్థాలతోనా? వీటిలో ఏది ఉత్తమం? ఏది శివుడికి అత్యంత ప్రీతికరం? ఇలాంటి ఎన్నో సందేహాలు కలుగుతూ ఉంటాయి. అయితే ‘ఈ సంపదలన్నీ నువ్వు ఇచ్చినవే స్వామీ!’ అని కృతజ్ఞత ప్రకటించడమే ఆ ద్రవ్యాలతో శివుణ్ని అభిషేకించడంలోని ఆంతర్యం. వీటిలో ఎక్కువ తక్కువలు లేవు. ఈ తర తమ భేదాలన్నీ మనం కల్పించుకున్నవే. మన దృష్టిలోనే ఈ ఎక్కువ తక్కువలు. శివుడి సృష్టిలో అన్నీ సమానమే. అతడు చూసేది మన అంతరంగంలోని నిశ్చల భక్తిని మాత్రమే.
‘శాంతి ధారా జలంబుల జలక మార్చి’ అన్నాడు శ్రీనాథ మహాకవి. అంటే, జ్ఞాన దీపం వెలుగుతూ ఉండగా, శాంతి ధారలతో అభిషేకించాలి. ‘మనసులో జ్ఞాన దీపం వెలిగితే, ఎక్కువ తక్కువలు ఉండవు. స్వ పర భేదాలు కూడా ఉండవు. రాగద్వేషాలకూ, అహంకార మమకారాలకూ అతీతమైన ఒక ప్రశాంతత హృదయంలో నెలకొని ఉంటుంది. ఈ ప్రశాంతతే శివాభిషేకానికి తగిన శ్రేష్ఠమైన పదార్థం. ప్రపంచమంతా శివమయం అని, అందరూ తనవారేనని, తానేనని, సృష్టి అంతా ఒక్కటేననీ పవిత్ర భావాలను శివుడికి పూజా పుష్పాలుగా సమర్పించే ప్రయత్నం చేయాలి. పూజలో మనం సమర్పించే పూలు స్వచ్ఛంగా, పరిమళ భరితంగా, పవిత్రంగా ఉండాలని మనం కోరుకుంటాం కదా! ఆ పూలు మన భావాలే అయినప్పుడు ఆ మనసు నిష్కల్మషంగా, పవిత్రభావ పరిమళాలతో నిండి ఉండాలి. అలాంటి దీపారాధన, అభిషేకం, అర్చన జరుగుతూ ఉంటే, ‘అతి విశుద్ధ మనోవృత్తి’ సిద్ధిస్తుంది. ఈ స్థితిని అనుభవానికి తెచ్చుకోవటానికి మనం చేసే దీపారాధన, అభిషేకం, పుష్పార్చన దోహదం కావాలన్నదే శ్రీనాథ కవి ఆశయం.
.. ✍ శ్రీమూర్తి
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
అమ్మవారికి నిమ్మకాయల హారం వేయడం వెనుక ఆంతర్యం ఏమిటి?
అయ్యప్ప దర్శనానికి స్వాములు ఇరుముడి ఎందుకు తీసుకెళ్తారు?
మొండి రోగాలను నయం చేసే వైద్యనాథుడి ఆలయం.. ఎక్కడో తెలుసా !
Gudipadu | తెలంగాణలోని ఈ గుడిలో గిరిజనులే పూజారులు
పెండ్లిళ్లు, శుభకార్యాల సమయంలో కంకణం ఎందుకు కడతారు?
ధర్మ సందేహం… పిండం కాకి తినకపోతే ఏమౌతుంది?
తండ్రీకొడుకులు ఇద్దరు ఒకే నక్షత్రంలో పుడితే దోషమా?