పితరుల ఆత్మ శాంతించదని, పితృ దోషమని అంటారు నిజమేనా? గోవర్ధన్, కామారెడ్డి
మనం సమర్పించిన దానితో పితృదేవతలు తృప్తి చెందుతారు. వాళ్లు తృప్తి చెందడమే కాదు ‘పునరాప్యాయయంతి చ’ అంటే తమ వారసులనూ తృప్తి పరుస్తారు. శ్రాద్ధ కర్మలను శాస్ర్తానుసారం ఆచరించిన వారిని పితరులు తప్పక అనుగ్రహిస్తారు. శ్రాద్ధం అంటేనే శ్రద్ధతో, ఏమరుపాటు లేకుండా చేసేది. ‘తేతే శ్రేయో విధాస్యంతి సర్వకామఫలప్రద’ అన్నారు. ఐహికంగా అన్ని ఫలాలు పితృదేవతలు ప్రసాదిస్తారు. సాధారణంగా పిండ ప్రదానం చేసినప్పుడు కాకులు వచ్చేస్తాయి.
అందుకే కాకిని ‘బలి భుక్కు’ అంటారు. బలులను తినేదని అర్థం. కాకికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అది దీర్ఘకాలం జీవిస్తుంది. రహస్య మైథునం అనుభవిస్తుంది. కాకి ఒక కన్ను పితృదేవతలకు నివాసం అని చెబుతారు. అందుకే పిండ ప్రదాన సమయంలో కాకి చూసిందంటేనే పితృదేవతల అనుగ్రహం లభించిందని భావిస్తారు. ఇక తినడం, తినకపోవడం దాని ఇష్టం. అంతేకాని, తింటేనే పితృదేవతలు సంతృప్తి చెందినట్టు అని, తినకపోతే వారికి సంతృప్తి కలగలేదని, దోషమని భావించడానికి ఆధారం లేదు. తింటే మాత్రం శుభమని లోకంలో ప్రచారంలో ఉంది.