వైద్యుడిని నారాయణుడితో పోలుస్తాం. వైద్య నారాయణుడని కీర్తిస్తాం. కానీ, సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం బెక్కల్లో భూతనాథుడైన శివుడు వైద్యనాథుడై భవ రోగాలను వదిలిస్తున్నాడు. వ్యాధిగ్రస్థులకు ఆరోగ్యాన్ని, గ్రహ పీడితులకు మనశ్శాంతిని ప్రసాదిస్తున్నాడు. రామలింగేశ్వరుడు స్వప్నంలో సాక్షాత్కరించి శస్త్ర చికిత్సలూ చేస్తాడని భక్తుల విశ్వాసం. దీంతో, ఈ ఆలయం రద్దీలో చికిత్సాలయాన్ని తలపిస్తుంది.
రోగ నివారణ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది.. సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని బెక్కల్ రామాచల గుట్టపై గల రామలింగేశ్వర ఆలయం. ఎన్ని దవాఖానలు తిరిగినా నయంకాని మొండి రోగాలు కూడా స్వామి కరుణతో తగ్గిపోతాయని భక్తుల విశ్వాసం. కాబట్టే, సాధారణ వైద్యం మీద ఆశలు చచ్చినవాళ్లు.. బతుకు మీద మమకారంతో రామలింగేశ్వరుడిని శరణు వేడతారు. నియమ నిష్ఠలతో ఉపాసిస్తారు. నిజానికి, చుట్టూ ఉన్న పచ్చని వాతావరణం, ఆహ్లాదకరమైన పరిసరాలే సగం రోగం తగ్గిస్తాయి. భక్తులపాలిట కొంగుబంగారమైన బెక్కంటి రామలింగేశ్వరస్వామి ఆలయం మరో రామేశ్వర క్షేత్రంగా విరాజిల్లుతున్నది. తెలంగాణ జిల్లాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక తదితర సరిహద్దు రాష్ట్రాల నుంచీ భక్తులు తరలివస్తారు. ఏటా మాఘమాస పౌర్ణమి మొదలు శివరాత్రి వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఆ సమయంలో ధూళిమిట్ట కైలాస పర్వతమే అవుతుంది.
రామాచల క్షేత్రంలో మూలవిరాట్టు రామలింగేశ్వరస్వామితో పాటు పలు ఉపాలయాలు ఉన్నాయి. ఆలయం చుట్టూ 21 శివాలయాలతో పాటు మల్లికార్జున స్వామి, అనంత పద్మనాభస్వామి, మహంకాళి, శివపార్వతులు, గణేశుడు కొలువుదీరారు. నవగ్రహ ఆలయమూ ఉంది. భారీ నందీశ్వరుడు స్వామి చెంతన కొలువుదీరాడు. గుట్టపై కొన్నేండ్ల క్రితం ఆంజనేయస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఎత్తయిన మారుతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆలయం సమీపంలో కోనేరు ఉంది. ఆలయం కింద పోచమ్మ గుడి ఉంది. రామలింగేశ్వరస్వామి ఆలయ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వమూ దృష్టిసారించింది. మంత్రి హరీశ్రావు చొరవతో ప్రభుత్వం మూడేండ్ల క్రితం సుమారు రూ.80లక్షలు మంజూరు చేసింది. ఏటా బ్రహ్మోత్సవాలతో పాటు కల్యాణోత్సవాలు, శివరాత్రి వేడుకలు పెద్ద ఎత్తున జరుగుతాయి. ‘స్వామి అనుగ్రహంతో పరిపూర్ణ ఆరోగ్యవంతులైనవారు ఎంతోమంది. స్వప్న సాక్షాత్కారంతోనే పునర్జన్మనిస్తాడు మా దేవుడు. ఇక్కడ అర్చకత్వం నిర్వహించడం మా పూర్వజన్మ సుకృతం’ అంటారు పూజారులు.
కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమదేవి క్రీ.శ 1117 రాక్షసనామ సంవత్సరం, వైశాఖ పౌర్ణమి రోజున ఓరుగల్లు నగరానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెక్కంటి రామాచల గుట్టపై రామలింగేశ్వరస్వామిని ప్రతిష్ఠించి, చిన్న ఆలయాన్ని నిర్మించింది. విశ్వేశ్వరజీ అనే పూజారిని నియమించింది. అర్చకుడి జీవనోపాధి కోసం కొంత మాన్యం దానంగా ఇచ్చింది. బెక్కంటి అసలు పేరు భద్రంగపురం. ఈ ప్రాంతాన్ని కాకతీయుల సామంతరాజుగా మల్లిరెడ్డి పాలించాడు. రుద్రమ నిర్మించిన ఆలయాన్ని తన తల్లి పేరుతో మరింత విస్తరించాడు. ఇక్కడి శాసనాల్లో మల్లిరెడ్డి వంశ కావ్యాన్ని రాయించాడు. తన వంశంలోని 21 మంది పేరిట 21 శివాలయాలు నిర్మించాడు. పూజా కైంకర్యాల కోసం మరికొంత భూమిని, మామిడితోటను దానం చేసినట్లు ఆలయ శాసనాల ద్వారా తెలుస్తున్నది.
✍ మ్యాక వెంకటేశ్వర్లు
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Gudipadu | తెలంగాణలోని ఈ గుడిలో గిరిజనులే పూజారులు
అయ్యప్ప దర్శనానికి స్వాములు ఇరుముడి ఎందుకు తీసుకెళ్తారు?
గాంధారి మైసమ్మ | మేడారం జాతరలాగే రెండేండ్లకొకసారి జరిగే ఆదివాసీల జాతర గురించి తెలుసా
పెండ్లిళ్లు, శుభకార్యాల సమయంలో కంకణం ఎందుకు కడతారు?
ధర్మ సందేహం… పిండం కాకి తినకపోతే ఏమౌతుంది?
ఆది శంకరాచార్యులు సన్యాసం స్వీకరించేందుకు తల్లిని ఎలా ఒప్పించాడో తెలుసా?
గ్రేట్ వాల్ ఆఫ్ తెలంగాణ.. ఇది ఎక్కడుంది.. దాని ప్రత్యేకతలేంటి తెలుసా?