సిద్దిపేట అర్బన్, ఆగస్టు 1: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ఈ నెల 10 వరకు కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించిందని, ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట కలెక్టర్ కె.హై మావతి సూచించారు. శనివారం సిద్దిపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఎస్ఐఆర్ పై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా డిజిటలైజేషన్ పూర్తైన తర్వాత ఈనెల 17న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించడం జరుగుతుందని, దీనిపై సెప్టెంబర్16 వరకు అభ్యంతరాలు స్వీకరించి అక్టోబర్ 16 నాటికి వాటిని పరిష్కరించి 19న కేంద్ర ఎన్నికల సంఘం తుది ఓటరు జాబితా ప్రచురిస్తుందన్నారు.ఎస్ఐఆర్లో భాగంగా చనిపోయిన ఓటర్లు, డబుల్ ఓటర్లు, పూర్తిగా బదిలీ అయిన ఓటర్లను తీసివేయగా జిల్లాలో 99.75 శాతం ఓటర్ల డిజిటలైజేషన్ పూర్తయిందన్నారు. కార్యక్రమంలో శిక్షణ డిప్యూటీ కలెక్టర్ భవ్య, వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు,అధికారులు పాల్గొన్నారు.
10 వరకు ఫారాలు సమర్పించవచ్చు
సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 1: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణ గడువును భారత ఎన్నికల సంఘం ఆగస్టు 10వ తేదీ వరకు పొడిగించిందని సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్ జైన్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించని అర్హులైన ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నిర్ణీత గడువులోగా తమ ఫారాలు సమర్పించాలని కోరారు. ఇప్పటి వరకు జిల్లాలో 78 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని వివరించారు. ఇంకా ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించని అర్హులైన ఓటర్లు ఈనెల 10లోగా సం బంధిత బీఎల్వోలకు సమర్పించాలని ఆయన సూచించారు.