ఇయ్యాల్టి నుంచే పంట పెట్టుబడి సాయం
వానకాలం రైతు బంధుకు సర్వం సిద్ధం
తక్కువ భూమి గల రైతులతో మొదలు
నల్లగొండ జిల్లాలో 5.08లక్షల మంది
సూర్యాపేటలో 2.91లక్షలు
యాదాద్రి భువనగిరిలో 2.55లక్షలు
ఈ నెల 5 వరకు రిజిస్ట్రేషన్ ఉన్న రైతులకు అవకాశం
కొత్తగా 34వేల మందికి లబ్ధి
వరుసగా ఇది తొమ్మిదోసారి.. రైతుల్లో హర్షాతిరేకాలు
వానకాలం సాగుకు సమాయత్తమవుతున్న రైతాంగానికి పెట్టుబడి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అన్నదాతకు దన్నుగా వరుసగా తొమ్మిదోసారి రైతు బంధు సాయం అందించనున్నది. మంగళవారం ఎకరంలోపు విస్తీర్ణం ఉన్న రైతులతో ప్రారంభించి నేరుగా లబ్ధిదారులందరి ఖాతాల్లో డబ్బు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. గత ఎనిమిది విడుతల్లో రూ.7,930 కోట్ల పెట్టుబడి సాయం ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగాన్ని వడ్డీ వ్యాపారులు, మిత్తిల భారం నుంచి గట్టెక్కించగా, ఈ సీజన్లో 10.54 వేల మందికి సుమారు 1,236 కోట్ల రూపాయలు అందనున్నాయి. ఈ నెల 5 వరకు పట్టాదారు పాస్పుస్తకం పొందిన రైతులకు సైతం అవకాశం కల్పించడంతో లబ్ధిదారుల సంఖ్య మరో 34 వేలు పెరుగనున్నది. ఉమ్మడి రాష్ట్రంలో కష్టనష్టాలతో సాగిన ఎవుసాన్ని గాడిలో పెట్టి, సీజన్ ప్రారంభంలోనే పెట్ట్టుబడి సాయం అందిస్తున్న సీఎం కేసీఆర్కు రైతులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
నల్లగొండ ప్రతినిధి,జూన్ 28(నమస్తే తెలంగాణ)/యాదాద్రి : సమైక్య రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యంతో వెన్నువిరిగిన రైతును నిలబెట్టేందుకు సీఎం కేసీఆర్ చిత్తశుద్ధ్దితో పనిచేస్తున్నారన్న దానికి నిదర్శనమే రైతుబంధు. సీజన్ ఆరంభంలో రైతులు పెట్టుబడులకు ఇబ్బందులు లేకుండా సర్కారే ఆర్థిక సాయం అందిస్తూ సాగుపై భరోసా కల్పిస్తున్నది. రైతు బంధు పథకం అమలు తర్వాత వేలాది ఎకరాల బీడు భూములు సైతం సాగులోకి వచ్చినట్లు వ్యవసాయశాఖ లెక్కలు స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో స్వరాష్ట్రంలో అదనంగా 8.50 లక్షల ఎకరాలు సాగులోకి రావడంలోనూ రైతుబంధు పథకానిది కీలక పాత్రనే. 2018 వానకాలంలో ఎకరానికి నాలుగు వేల చొప్పున తరవాత ఐదు వేల చొప్పున రెండు సీజన్లలో అందిస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో పట్టా దారు పాసుపుస్తకం ఉన్న ప్రతి రైతుకూ నగదు జమ అయ్యేలా ఎప్పటికప్పుడూ చర్యలు చేపడుతూ అందర్నీ ఈ పథకం పరిధిలోకి తీసుకువచ్చారు. సీజన్ల వారీగా కొత్తగా పాసు పుస్తకాలు పొందిన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పిస్తూ వస్తున్నారు. పాసు పుస్తకాలు ఉండి… దరఖాస్తు చేసుకోని రైతులు ఉంటే వారి వివరాలు సేకరించేలా వ్యవసాయ అధికారుల వెంటపడి పెట్టుబడి సాయం అందజేస్తున్నారు. ఈ సారి కూడా కొత్తగా పాసుపుస్తకాలు పొందిన వారికి కూడా పెట్టుబడి సాయం అందించేందుకు ఈ నెల 5 వరకు రిజిస్ట్రేషన్లు జరిగిన కొత్త రైతులకు అవకాశం కల్పించారు. దాంతో ఈ ఒక్క సీజన్లోనే రైతుల సంఖ్య ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 34వేల పైచిలుకు పెరుగనుంది. ఈ సీజన్లో రైతులకు అందించనున్న పెట్టుబడి సాయం కూడా మరింత పెరుగనుంది. మొదటగా ఎకరం భూమి ఉన్న రైతుల నుంచి 10 రోజుల్లో అర్హులైన వారందరికీ ప్రాధాన్యత క్రమంలో రైతుబంధు నగదు పట్టాదారు బ్యాంకు ఖాతాలో జమ కానుంది.
నల్లగొండలో 5.08 లక్షల మంది అర్హులు
రాష్ట్రంలోనే రైతుబంధు ద్వారా అత్యధిక ప్ర యోజనం పొందే జిల్లా నల్లగొండనే. ఈ వానకాలంలో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో మొత్తం 5,08,298 మంది రైతులు పట్టాదారు పాసు పుస్తకాలు కలిగిన రైతులుగా వ్యవసాయ శాఖ లెక్కలు తేల్చింది. ఇందుకోసం రూ. 617 కోట్ల అవసరం అవుతాయని అంచనా వేశారు. గత యాసంగితో పోలిస్తే ఈ సీజన్లో 15,152 మంది రైతులు అదనంగా పెరిగారు. వీరికి మరికొంత మంది కూడా తోడు కావచ్చని తెలుస్తోంది. కాగా గత సీజన్ ఎనిమిదో విడుతలో నల్లగొండ జిల్లాలో మొత్తం 4.93లక్షల మంది రైతులను అర్హులుగా గుర్తించి వారికి రూ.616.21 కోట్లను అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ వివరాలు అందించిన రైతుల మేరకు మొత్తం 4,69,696 మందికి రూ.601.74 కోట్లు పంపిణీ చేశారు. ఈ సారి రైతుల సంఖ్య పెరగడంతో అందనున్న సాయం కూడా పెరుగనుంది.
సూర్యాపేటలో 2.91లక్షల మంది…
సూర్యాపేట జిల్లాలో ఈ వానకాలం సీజన్కు మొత్తం 2,91,682 మందిని అర్హులుగా వ్యవసాయ శాఖ లెక్కలు తేల్చింది. వీరికి ఎకరానికి ఐదు వేల చొప్పున మొత్తం 316 కోట్ల రూపాయలను పెట్టుబడి సాయంగా అందించాలని అంచనా వేశారు. ఈ జిల్లాలోనూ యాసంగితో పోలిస్తే 11,876 మంది రైతులు అదనంగా అర్హులుగా ఉన్నట్లు తేల్చారు. యాసంగిలో జిల్లాలో 2.79లక్షల మంది అర్హులు ఉన్నారని గుర్తించగా అందులో 26,1079 మంది రైతులు తమ వివరాలు అందజేశారు. మొత్తం 314కోట్ల అంచనాకు వివరాలు అందించిన ప్రకారం రూ.309.28కోట్లు రైతులకు పంపిణీ చేశారు. కొత్తగా పాసుపుస్తకాలు పెరుగడంతో ఈ సారి కూడా అర్హులైన రైతుల సంఖ్య కూడా పెరిగింది.
యాదాద్రి జిల్లాలో 2.54లక్షల మంది…
జిల్లాలో 6,07,745 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా.. మొత్తం 2,54,977 మంది రైతులకు రూ.303.87 కోట్లు పెట్టుబడిసాయంగా అందనుంది. గత యాసంగిలో జిల్లాలో 2.43లక్షల మంది అర్హులు ఉన్నారని భావించగా అందులో 2,25,956 మందే తమ వివరాలను నమోదు చేసుకున్నారు. దాంతో రూ.302 కోట్ల లక్ష్యానికి రూ. 292.74కోట్ల అందించగలిగారు. కొందరు రైతులు వివిధ కారణాలతో…బ్యాంకు ఖాతాల్లో సమస్యలు, ఎన్ఆర్ఐలు, ఇంకొందరు తమ వివరాలు అందజేసేందుకు సుముఖంగా లేకపోవడంతో పెట్టుబడి సాయాన్ని పొందలేకపోయారు.
కొత్తగా 33,384 మందికి రైతు బంధు
ఈ ఏడాది వానకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా 2,54,977 మంది రైతులు రైతుబంధు పథకానికి అర్హులుగా గుర్తించాం. ఇందులో కొత్తగా 33,384 మంది రైతుబంధు పొందనున్నారు. ఈ నెల 22 నాటికి పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులు అర్హులు. కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులు పాసు పుస్తకం, బ్యాంకు పాసు పుస్తకం మొదటి పేజీ జిరాక్స్ కాపీలను వ్యవసాయ విస్తరణ అధికారికి అందజేయాలి.
– పమేలా సత్పతి, కలెక్టర్, యాదాద్రి భువనగిరి
ఎనిమిది సీజన్లు.. రూ.7,930 కోట్లు
2018 వానకాలం నుంచి రైతుబంధు పథకం ప్రారంభమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ యాసంగి నాటికి మొత్తం 8 సీజన్లలో నిరాటకంగా పెట్టుబడి సాయం అందిస్తూనే ఉన్నారు. మొత్తం ఎనిమిది సీజన్లలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం రూ.7,930 కోట్లను ఇప్పటి వరకు రైతులకు పెట్టుబడి సాయంగా అందించారు. గతంలో ఏ పథకంలో అయినా దళారుల ప్రమేయం లేదా వివిధ రూపాల్లో లంచాలు ఇతరత్రా కారణాలతో 10 నుంచి 20 శాతం సాయం దారి మళ్లేది. కానీ ఇందులో ఎవరికీ సంబంధం లేకుండా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకే నగదును బదిలీ చేస్తూ వస్తున్నారు. ఈ రకంగా ప్రతీ పైసా రైతులకే చేరుతుంది. మొత్తం 8 విడుతల్లో కలిపి నల్లగొండ జిల్లాలో రూ.4,170కోట్లు, సూర్యాపేట జిల్లాలో రూ.1,833కోట్లు, యాదాద్రి జిల్లాలో రూ.1,927 కోట్లు రైతులకు చేరాయి. ఈ నగదుతో కొత్తగా ఎంతో మంది రైతులు వ్యవసాయంలోకి దిగారు. గతంలో భూములు వదిలి వెళ్లిన రైతులు సైతం తిరిగి వచ్చి పంటల సాగులో బిజీ అయ్యారు.