KCR | హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): దశాబ్దాల స్వరాష్ట్ర పోరాటాలను గమ్యానికి చేర్చిన తెలంగాణ అస్థిత్వ రాజకీయ పార్టీ భారత రాష్ట్ర సమితి (నాటి తెలంగాణ రాష్ట్ర సమితి) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు, రాష్ట్ర ప్రజలకు, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాల పునాదుల మీద పుట్టిన పార్టీ.. ప్రత్యేక రాష్ట్ర సాధన గమ్యాన్ని ముద్దాడి, పదేండ్ల పాలనలో ప్రజలకు అద్భుతమైన ప్రగతి ఫలాలు అందించిందని తెలిపారు. తద్వారా దేశం గర్వించే రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని వెల్లడించారు. ఇది ప్రజాస్వామిక వాదులందరికీ, ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమని వివరించారు. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు 23 ఏండ్లుగా పార్టీ ఎన్నో విజయాలు సాధించిందని అన్నారు.
ప్రజల స్వరాష్ట్ర స్వయంపాలన ఆకాంక్షలను నెరవేర్చే క్రమంలో దారి, దరి దొరకని స్థితిలో ఉన్న తెలంగాణ సమాజానికి, ప్రజాస్వామిక పార్లమెంట్ పంథాలో దిక్సూచిగా నిలిచిందని తెలిపారు. వేల సంఖ్యలో, పలు స్థాయిల్లో నాయకత్వాన్ని తీర్చిదిద్ది రాష్ర్టాన్ని సాధించడమే కాకుండా, ప్రగతి పథంలో రాష్ర్టాన్ని నడిపించిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి, ఆ పార్టీ ప్రభుత్వానికి దక్కుతుందని వెల్లడించారు. ప్రపంచ రాజకీయ పార్టీల చరిత్రలో బీఆర్ఎస్ది ప్రత్యేక స్థానమని కొనియాడారు. అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ, పలు మైలురాళ్లు అధిగమించడానికి బలమైన పునాదులు వేసింది పార్టీ కార్యకర్తలేనని స్పష్టం చేశారు. ప్రజలతో, మేధావివర్గాలతో మమేకమై కొనసాగించిన వారి ఉద్యమ అంకితభావమే నేటి తెలంగాణ ప్రగతికి కారణమని శ్లాఘించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు దన్నుగా నిలుస్తూ, ప్రజల ఆదరణ మరింతగా పొందేందుకు నాయకులు, కార్యకర్తలు ఈ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రతినబూనాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.