నల్లగొండ, ఏప్రిల్ 26 : ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచి భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. జిల్లాలో శుక్రవారం రికార్డు స్థాయిలో 45.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిడమనూరులో అత్యధికంగా 45.2 డిగ్రీలు, మాడ్గులపల్లిలో 45.1, త్రిపురారం, వేములపల్లిలో 45.0 డిగ్రీలు నమోదయ్యాయి. మరో పది మండలాల్లో 44 డిగ్రీలకు పైగా, మిగిలిన మండలాల్లో 42 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నాయి.
కనిష్ఠ ఉష్ణోగ్రతలు సైతం 30 డిగ్రీలకుపైనే ఉంటున్నాయి. ఎండలకు బయటికి వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. అత్యవసర పనులు ఉంటే ఉదయం, సాయంత్రం చూసుకొని ఇంటికే పరిమితమవుతున్నారు. రైతులు, కూలీలు, కార్మికులకు ఎండలతో ఇబ్బందులు తప్పడం లేదు. వడగాలులతోపాటు ఉక్కపోతతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏసీలు, కూలర్లు వినియోగం భారీగా పెరిగింది. శీతల పానీయాలు, మజ్జిగ, కుల్డ్రింక్స్ వ్యాపారాలు జోరందుకున్నాయి. వడదెబ్బ కొట్టే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.