హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికారంలో ఉండగా ‘తల నరుక్కుంటా’ అని చెప్పి అనేక హామీలు అమలు చేయలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు మొదటి సీఎంను దళితుడిని చేయకపోతే మెడ నరుక్కుంటా అని కేసీఆర్ పది లక్షలసార్లు అన్నారని, రెండుసార్లు అధికారంలోకి వచ్చినా చేయలేదని పేర్కొన్నారు.
దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదన్నారు. ‘నువ్వు తలకాయ తీసేయలేదు కదా.. మమ్మల్ని తియ్యమంటవా? లేకపోతే దళితులు తలకాయ తీయాలా?’ అని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి హరీశ్రావు రైతులపై ప్రేమ ఉన్నట్టు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రాజీనామా పత్రం ఒకటిన్నర లైన్ మాత్రమే ఉండాలని, ఒకటిన్నర పేజీ రాసుకొచ్చారని మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే రుణమాఫీ చేసేందుకు ప్రయత్నించామని, బ్యాంకులకు డబ్బు చెల్లించాల్సి రావడంతో వీలుకాలేదని పేర్కొన్నారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ హామీ నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు.