హనుమకొండ, ఏప్రిల్ 26: బీఆర్ఎస్ పార్టీని వీడేది లేదని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మాజీ ఎంపీ రామసహాయం సురేందర్రెడ్డి తన రాజకీయ గురువని, తనను సొంత కుటుంబ సభ్యుడిగా చూసుకున్నారని సారయ్య తెలిపారు. ఆయన కుమారుడు రఘురాంరెడ్డికి ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిత్వం దక్కితే మర్యాదపూర్వకంగా అతడిని కలిసేందుకు ఖమ్మం వెళ్లినట్టు తెలిపారు.
ఆర్ఎస్ది, తనది గురుశిష్యుల బంధమని, రాజకీయాలతో సంబంధం లేదని తేల్చిచెప్పారు. తాను కాంగ్రెస్లో నాయకుడిగా ఎదగడంలో సురేందర్రెడ్డి పాత్ర కీలకమని, కష్టనష్టాల్లో తనకు వెన్నుదన్నుగా ఆర్ఎస్ నిలిచారని పేర్కొన్నారు. మర్యాదపూర్వకంగా కలిస్తే పార్టీ మారబోతున్నట్టుగా ప్రచారం చేయడం తగదని అన్నారు. తాను బీఆర్ఎస్ పార్టీని వీడేది లేదని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తానని సారయ్య స్పష్టం చేశారు.