ఎదులాపురం/సోన్, సెప్టెంబర్ 21: ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా కేంద్రాలోని రెండు కారు షోరూముల్లో ఒకే రోజు రెండు గంటల వ్యవధిలో దొంగతనం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా మావల మండలకేంద్రంలో ఉన్న కారు షోరూంలో మంగళవారం రాత్రి సినీ ఫక్కీలో చోరీ చేశారు. రూరల్ సీఐ రఘుపతి, వాచ్మన్ ఆరిపెల్లి భూమన్న తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో కారుషోరూంలోకి ముఖానికి మాస్కులు వేసుకున్న నలుగురు ఆగంతకులు చొరబడ్డారు. వారు అక్కడ పడుకొని ఉన్న వాచ్మన్ ఆరిపెల్లి భూమన్నకు పిస్తోల్ చూపించి భయపెట్టారు. బాత్రూంలోకి తీసుకెళ్లి గడియపెట్టారు. తర్వాత ఈ షోరూం షటర్ లేపి బీరువాలో ఉన్న రూ.3 లక్షల నగదుతో ఉడాయించారు. బుధవారం ఉదయం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కారుషోరూం మేనేజర్ పోలీసులకు సమాచారమివ్వడంతో క్లూస్ టీం నేరం జరిగిన ప్రదేశంలో పరిశీలన చేసింది. వేలిముద్రలు సేకరించింది. మేనేజర్ ఫిర్యాదు మేరకు మావల ఎస్ఐ విష్ణువర్ధన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
నిర్మల్లోని హుండాయ్ షోరూంలో..
నిర్మల్ మండలంలోని ఎల్లపెల్లి గ్రామ శివారులో ఎన్హెచ్ 44 పక్కన ఉన్న హుండాయ్ కారు షోరూంలోనూ దొంగలు చొరబడినట్లు నిర్మల్ రూరల్ సీఐ వెంకటేశ్, ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు. కారు షోరూంలోకి నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో చొరబడి మొదట సెక్యురిటీగార్డును కొట్టి అతని వద్ద ఉన్న సెల్ఫోన్ను లాక్కొని లోపలికి చొరబడ్డారు. షోరూంలో వస్తువులేమీ లభించకపోవడంతో వెళ్లిపోయారు. సంఘటనా స్థలాన్ని నిర్మల్ డీఎస్పీ జీవన్రెడ్డి పరిశీలించి డాగ్స్కాడ్తో పరిశీలించారు. వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.