By Maduri Mattaiah
చెన్నై : ప్రముఖ నటుడు రజినీకాంత్ను కేంద్రప్రభుత్వం దాదా సాహెబ్ఫాల్కే అవార్డుకు ఎంపిక చేసింది. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలను గుర్తింపుగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది. చిత్రసీమలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న రజినీకాంత్కు దేశవిదేశాల్లో లెక్కకుమిక్కిలి అభిమానులు ఉన్నారు. తనలో నటుడిని గుర్తించి సినిమాల్లో ట్రై చేయమని నన్ను ప్రోత్సహించిన దోస్త్, బస్ డ్రైవర్ రాజ్ బహదూర్కు ఈ అవార్డును అంకితమిస్తున్నాను అని రజినీకాంత్ ఆదివారం ట్విట్టర్లో తెలిపారు.
తనకు ఫాల్కే అవార్డు రావడంతో పేరుపేరునా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపిన తలైవా.. తాను బస్ కండక్టర్గా ఉన్న సమయంలో ఎప్పటికైనా గొప్ప నటుడివి అవుతావని మా బస్ డ్రైవర్ రాజ్ బహదూర్ చెప్పేవాడని గుర్తుచేసుకున్నారు. ఆయన ప్రోత్సాహం, ఆదరణ కారణంగానే సినిమాల్లో అవకాశాల కోసం పలువురి వద్దకు వెళ్లి చివరకు అనుకున్నది సాధించానని రజినీ చెప్పారు.
అదేవిధంగా పేదరికంతో బాధపడుతున్నప్పటికీ.. నన్ను నటుడిగా మార్చడానికి ఎన్నో త్యాగాలు చేసిన సోదరుడు సత్యనారాయణ గైక్వాడ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా అని తెలిపారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం, ప్రతిపక్ష నాయకుడు ఎంకే స్టాలిన్, తన స్నేహితుడు, సహోద్యోగి కమల్హాసన్, ఇతర నాయకులకు, శ్రేయోభిలాషులకు రజనీకాంత్ కృతజ్ఞతలు తెలిపారు.
దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, మీడియా, స్టంట్ మాస్టర్లు, థియేటర్ల యజమానులు, తనకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి రజినీకాంత్ కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో తనకు అభినందనలు తెలిపిన ప్రధాని నరేంద్రమోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు, జైహింద్ అంటూ ముగించారు. ట్విట్టర్ చివరన బ్రతుకు.. బ్రతికించు.. అనే నినాదాన్ని రాయడం విశేషం.
రైతులకు మద్దతు తెలిపినందుకే కేంద్రం మమ్మల్ని శిక్షిస్తోంది: కేజ్రీవాల్
స్టాండప్ ఇండియా పథకానికి రూ.25,586 కోట్లు మంజూరు
ఇండోనేషియాలో భారీ వర్షాలు.. 23 మంది మృతి
లాంకో ప్రాజెక్టులో కూలిన బాయిలర్.. సురక్షితంగా బయటపడిన 16 మంది కార్మికులు
ఉత్తరాఖండ్లో దావానలం.. 1200 హెక్టార్ల అడవి బుగ్గి
బిల్గేట్స్.. మైక్రోసాఫ్ట్.. పరిచయం అక్కర్లేని పేర్లు.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..