పుణె : పెరుగుతున్న కొవిడ్ కేసులతో పుణె మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) నగరంలో పూర్తిస్థాయిలో వీకెండ్ లాక్డౌన్ ప్రకటించింది. ఈ నెల 30వ తేదీ వరకు లాక్డౌన్తో పాటు నైట్ కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు పేర్కొంది. నగరంలో అత్యవసర సేవలు, దుకాణాలు మినహాయించి మిగతా వాటన్నింటిని మూసివేయనున్నట్లు చెప్పింది. వారాంతపు లాక్డౌన్లో భాగంగా శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది.
ఇందులో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు అన్ని దుకాణాలు, మార్కెట్లు మూతపడనున్నాయి. ఇప్పటికే నగర పరిధిలో హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లను మూసివేసింది. సహకార, ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు, బీమా సంస్థలు, టెలికాం, ఐటీ సంస్థలు, న్యాయవాదులు, సీఏలతో పాటు ఇర్థిక సంస్థలకు సంబంధించిన కార్యాలయాలు తెరిచే ఉండనున్నాయి. పుణె జిల్లాలో గురువారం కొత్తగా 12వేల పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,16,127కు చేరగా.. ఇప్పటి వరకు 10,472 మంది మృత్యువాతపడ్డారు.