వాషింగ్టన్ : అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటు చేసుకుంది. టెక్సాస్లోని బ్రయాన్లోని పారిశ్రామిక పార్కులోని క్యాబినెట్ తయారీ పరిశ్రమలో ఓ దుండగుడు గురువారం కాల్పులు జరిపాడు. దీంతో ఒకరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. నిందితుడిని పట్టుకునే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ ఆఫీసర్పై సైతం కాల్పులు జరుపడంతో గాయాలయ్యాయి.
కెంట్మూర్ క్యాబినెట్స్లో జరిగిన కాల్పుల్లో గాయపడ్డ వారిని సెయింట్ జోసెఫ్ హెల్త్ రీజనల్ ఆసుపత్రికి తరలించినట్లు బ్రయాన్ పోలీసులు తెలిపారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి క్యాబినెట్ తయారీ ఉద్యోగి అని పోలీస్ చీఫ్ ఎరిక్ బుస్కే తెలిపారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో కాల్పుల ఘటనపై అధికారులకు సమాచారం వచ్చిందని, సంఘటనా స్థలంలో ఒక వ్యక్తి మరణించాడని, నలుగురిని హాస్పిటల్కు తరలించినట్లు చెప్పారు. గాయపడ్డ వారి పలువురి పరిస్థితి విషమంగా ఉందని, ఘటనలో మొత్తం ఏడుగురు గాయపడ్డారని పేర్కొన్నారు. ఒక వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డారని చెప్పారు.
కాల్పుల అనంతరం నిందితుడు పారిపోయాడని, గ్రిమ్స్ కౌంటీలో అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సమయంలో పబ్లిక్ స్టేఫ్టీ ఆఫీసర్పై కాల్పులు జరిపాడని, కానీ హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. అయితే కాల్పులకు మాత్రం కారణాలు తెలియరాలేదు. ఘటనపై టెక్సాస్ గవర్నర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టెక్సాస్ రేంజర్స్తో కలిసి పని చేస్తున్నామని, స్థానిక చట్ట అమలుకు సహాయం చేస్తామని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబోట్ ఒక ప్రకటనలో తెలిపారు. నిందితుడి విచారణ కోసం అవసరమైన విధంగా సహాయం చేస్తామన్నారు.