హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం మోసకారి ప్రభుత్వం అని, ఆరు గ్యారంటీలని చెప్పి ఒక్క గ్యారంటీ అమలు చేయలేకపోయిందని బీఆర్ఎస్( BRS) పార్టీ సికింద్రాబాద్(Secunderabad) లోక్సభ అభ్యర్థి పద్మారావు గౌడ్(Padmarao Goud )అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో(Parliament elections) భాగంగా మల్లేపల్లిలో ఎమ్మెల్సీ ఎంఎస్.ప్రభాకర్రావు, నియోజకవర్గం ఇన్చార్జి సీహెచ్.ఆనంద్కుమార్గౌడ్తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా పద్మారావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో తొలి సీఎం కేసీఆర్ మైనార్టీల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారన్నారు. బీజేపీ అభ్యర్థి కిషన్రెడ్డి కేంద్ర మంత్రిగా సికింద్రాబాద్కు చేసిందేమీ లేదని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ ఎన్నికలు రాగానే ఏ పార్టీలో ఉంటాడో కూడా తెలియదని విమర్శిం చారు. ప్రజల కోసం నిరంతరం పనిచేసే తనకు అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.
కేసీఆర్ను మార్గదర్శకంగా తీసుకుని ప్రజా సేవలో తాము ఎల్లప్పుడు ముందుంటామని హామీనిచ్చారు. మైనార్టీల కోసం చేసిన సంక్షేమాన్ని గుర్తించి నాంపల్లి నియోజకవర్గం ప్రజలు తనకు అత్యధిక మెజార్టీని అందించాలని పద్మారావు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజయ్, బాసిత్, అబ్దుల్ కలీం, మమత శ్రీశైలం గౌడ్, అనంతరాములు గౌడ్, ప్రదీప్ కుమార్ అగర్వాల్, సాయి, తదితరులు పాల్గొన్నారు.