Boora Narsaiah Goud | హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): బ్యాంకులు రుణాలు ఇవ్వకపోతే రైతు రుణమాఫీని అమలు చేయరా? అని బీజేపీ నేత బూర నర్సయ్యగౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రుణమాఫీని ఎగ్గొట్టేందుకు సీఎం రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో గత డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని చెప్పిన సీఎం ఇప్పుడు ఆగస్టు 15 నాటికి చేస్తానంటూ ఒట్లు వేశారని మండిపడ్డారు.
ఇప్పుడు రుణమాఫీ కార్పొరేషన్ ఏర్పాటుచేసి, రుణాలు తీసుకొచ్చి మాఫీ చేస్తామని చెప్తున్నాడన్నారు. బ్యాంకు రుణాలు ఇవ్వకపోతే రుణాలు మాఫీ చేయరా? అని ప్రశ్నించారు. ‘బ్యాంకు లోన్ ఇవ్వలేదు, కేంద్రం సహకరించలేదు’ అంటూ సాకులు చెప్పి రుణమాఫీని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ‘అప్పు చేస్తారా, కడుపు కట్టుకుంటారా, ఆర్ఆర్ ట్యాక్స్ బంద్ చేస్తారా? అనేది రైతులకు సంబంధం లేదు. రుణమాఫీ మాత్రమే కావాలి’ అని స్పష్టం చేశారు.