షిమ్లా : పెరుగుతున్న కరోనా కేసుల మధ్య మహమ్మారి కట్టడికి నైట్ కర్ఫ్యూ విధిస్తున్న రాష్ట్రాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే యూపీ, కర్ణాటక, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్ సైతం అదేబాటులో నడుస్తోంది. అత్యధికంగా కేసులు నమోదవుతున్న నాలుగు జిల్లాలో నైట్ కర్ఫ్యూ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాంగ్రా, ఉనా, సోలన్, సిర్మౌర్ జిల్లాలో ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 10 వరకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించనున్నట్లు అధికారులు తెలిపారు.
ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ అధ్యక్షతన ఆదివారం షిమ్లాలో జరిగిన ఉన్నత స్థాయి అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతి వ్యక్తి 72 గంటల్లోపు కరోనా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ నివేదిక తీసుకురావాలని స్పష్టం చేశారు. రిపోర్ట్ లేకుండా వస్తే 14 రోజుల పాటు గృహనిర్బంధంలో ఉండాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే, వ్యక్తి రాష్ట్రానికి వచ్చిన ఏడు రోజుల తర్వాత పరీక్షలు నిర్వహించనున్నారు. రిపోర్టులో నెగెటివ్ వస్తే నిర్బంధంలో ఉండాల్సిన అవసరం లేదు.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థలు ఆయా ప్రాంతాల్లో అన్ని స్టాండర్డ్ ఆపరేషన్ ప్రోటోకాల్స్, మార్గదర్శకాలను అమలు చేస్తాయని, ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారం ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. అన్ని మత, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్స్ను సమర్థవంతంగా అమలు చేసేందుకు స్థానిక స్థాయిలో ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించడంతో పాటు అందుకనుగుణంగా నిర్ణయాలు తీసుకోంది.