కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సోమవారం 7 గంటలకు ఏడో విడుత పోలింగ్ ప్రారంభమైంది. 294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్లో ఎనిమిది విడుతలుగా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆరు విడుతల పోలింగ్ పూర్తయింది. ఇవాళ సీఎం మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం భవానీపూర్తో సహా మరో 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. 284 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. 86లక్షల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు.
ముర్షిదాబాద్, పశ్చిమ్ బర్ధమాన్ జిల్లాల్లో తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 12,068 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతుందని, దక్షిణా దినాజ్పూర్, మాల్డాలో ఆరు, కోల్కతాలో నాలుగు పోలింగ్ జరుగనుంది. గతంలో జరిగిన అవాంఛనీయ సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ఈసీ భారీ భద్రత ఏర్పాటు చేసింది. 796 కేంద్ర బలగాలను మోహరించింది. ఎన్నికల్లో కొవిడ్ ప్రొటోకాల్స్ పాటించేలా చర్యలు చేపట్టింది. శానిటైజర్లు, హ్యాండ్ వాష్లు అందుబాటులో ఉంచడంతో పాటు సామాజిక దూరం పాటించేలా ఏర్పాటు చేసింది.
ఏడో దశ ఎన్నికల్లో అందరి దృష్టి భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంపైనే ఉంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇప్పటి వరకు భవానీపూర్ నుంచి పోటీ చేస్తూ వచ్చిన ఆమె ఈ సారి నందిగ్రామ్ నుంచి మాజీ టీఎంసీ నేత, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిపై పోటీ చేశారు. దీంతో ఈ స్థానం నుంచి ప్రముఖ రాజకీయ వేత్త, రాష్ట్ర విద్యుత్ మంత్రి శోభన్దేబ్ ఛటోపాధ్యాయ బరిలో ఉన్నారు. బీజేపీ ప్రముఖు నటుడు రుద్రనిల్ ఘోష్ను బరిలో నిలిపింది. రాష్ట్ర మంత్రి ఫిర్హాద్ హకీమ్ సైతం కోల్కతా పోర్ట్ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయంపై కన్నువేయగా.. బీజేపీ రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సుబ్రతా సాహాను మహానగరంలోని రాష్ బెహారి స్థానం నుంచి బరిలోకి దింపింది.